సాక్షి, హైదరాబాద్: ఇళ్లు/ఫ్లాట్/యూనిట్ విక్రయాల కోసం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ముందస్తు ప్రకటనలు ఇచ్చి మోసం చేయొద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లతో పాటు ప్రచార మాధ్యమాలను తెలంగాణ రెరా అథారిటీ హెచ్చరించింది. రెరా చట్టం ప్రకారం నిర్మిత స్థలం 500 చదరపు మీటర్లకు మించినా, యూనిట్ల సంఖ్య 8 కంటే ఎక్కువగా ఉన్నా సంబంధిత ప్రాజెక్టును తప్పనిసరిగా రెరాలో నమోదు చేయించాలని సూచించింది.
రెరా అథారిటీ ప్రాజెక్టు వివరాలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ నంబర్ జారీ చేస్తుందని తెలియజేసింది. రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన తర్వాతే విక్రయాలను ప్రోత్సహించడానికి ప్రకటనలు జారీ చేయాల్సి ఉంటుందని ప్రమోటర్లు/డెవలపర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను కోరింది. రిజిస్ట్రేషన్ నంబర్ పొందకుండానే చట్టవిరుద్ధమైన ప్రకటనలు జారీ చేసిన పలు సంస్థలకు షోకాజ్ నోటీసులను జారీ చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
నోటీసులు అందుకున్న సంస్థల్లో గోద్రెజ్ ప్రాపర్టీస్, నవనామి ఎలివేట్ ప్రాజెక్టు, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్ తదితర సంస్థలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ పొందుపరిచినప్పటికీ.. ప్రకటనల్లోని సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. స్వర్గసీమ కన్స్ట్రక్షన్ చేపట్టిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల పరిమాణం, ప్రాజెక్టు పూర్తి పేరు విషయంలో వైరుధ్యాలతో పాటు ప్రాజెక్టును లేఅవుట్గా రిజిస్టర్ చేసినట్టు గుర్తించింది. ప్రకటనలో మాత్రం నివాస ప్రాజెక్టుగా పేర్కొంటూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించినందుకు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: సిటీలో సామాన్యుడు ఇల్లు కొనాలంటే..


