మనకు చిన్నపాటి తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం. కడుపు ఉబ్బరంగా ఉంటే ‘సోడా’తో సర్దుకుపోతాం. ‘అదంతా గ్యాస్ ప్రాబ్లమ్ లే’ అని మనకు మనమే సర్దిచెప్పుకుంటాం. కానీ మన శరీరం మనకు ఎప్పటికప్పుడు రహస్య భాషలో హెచ్చరికలు పంపిస్తుంటుంది. ఆ భాషను అర్థం చేసుకునేందుకు వైద్యులు ‘టూ వీక్ రూల్’ అనే ఒక గీతను గీశారు. మనకు వచ్చిన అనారోగ్యం 14 రోజుల గీతను దాటిందా? అయితే దానిని తేలికగా తీసుకోకూడదు. అది లోలోపల పొంచి ఉన్న ఏదో పెద్ద ముప్పును సూచిస్తూ మన శరీరం కొడుతున్న ‘అలారం’ కావచ్చు. దానిని నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు మన ఊహకు అందవు. అసలు ఈ 14 రోజుల నిబంధన వెనుక ఉన్న ఆ లోతైన రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాణ రక్షణ కవచం
వైద్య శాస్త్రంలో ‘టూ వీక్ రూల్’ (Two-Week Rule) అనేది ఒక ప్రాణ రక్షణ కవచం వంటిది. ఏదైనా అనారోగ్య సమస్య.. అది దగ్గు కావచ్చు, కడుపులో మంట కావచ్చు లేదా ఒళ్లు నొప్పులు కావచ్చు.. వరుసగా 14 రోజుల పాటు మనల్ని ఇబ్బంది పెడుతుంటే, దానిని సాధారణ సమస్యగా భావించకూడదు. ఈ కాలపరిమితి దాటిన తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోతే, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
ఎసిడిటీ అనుకుంటూ కాలం గడిపేస్తే..
చాలా మంది చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఎసిడిటీ లేదా అజీర్తి అని భావించి కాలం గడిపేస్తుంటారు. గ్యాస్ట్రో-ఆంకాలజీ నిపుణులు డాక్టర్ కార్తీక్ సాహ్ని అభిప్రాయం ప్రకారం, శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా అంతర్గత వాపులు 14 రోజులు దాటినా తగ్గడం లేదంటే, లోలోపల ఏదో తీవ్రమైన వ్యాధి పెరుగుతున్నదని అర్థం చేసుకోవాలని సూచించారు.
తిరగబెట్టడం ప్రమాద సంకేతం
కొద్దిపాటి అనారోగ్య సమస్యలకు మందులు వాడితే తగ్గిపోతోంది కదా అని చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఉంది. మందులు వాడినప్పుడు లక్షణాలు తగ్గి, అవి మానేయగానే మళ్లీ తిరగబెట్టడం. ఇలా జరగడం అనేది ఒక ప్రమాద సంకేతం. తాత్కాలిక ఉపశమనం కోసం వాడే మాత్రలు అసలు వ్యాధిని మరుగున పడేస్తాయని, దీనివల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం జరిగి ప్రాణాల మీదకు వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్వయం వైద్యం.. మరింత ముప్పు
చాలా మంది ఆస్పత్రికి వెళ్లే బదులు మందుల షాపులకు వెళ్లి, సొంతంగా ట్యాబ్లెట్లు కొనుక్కుని వాడుతుంటారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు డాక్టర్ మనీష్ దొడ్మని ఇదే అంశంపై మాట్లాడుతూ ఈ ‘సెల్ఫ్ మెడికేషన్’ వల్ల వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవన్నారు. దీని వలన వ్యాధి ముదిరిపోయి, చికిత్స అందించడం కష్టతరమయ్యే స్టేజీకి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
నిశ్శబ్దంగా వచ్చే వ్యాధులు
క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు ప్రారంభ దశలో ఎటువంటి తీవ్రమైన నొప్పిని లేదా గుర్తించదగిన లక్షణాలను చూపించవు. అందుకే శరీరంలో వచ్చే ఏ చిన్న మార్పును కూడా విస్మరించకూడదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ముందే గుర్తిస్తే ఎంతటి వ్యాధినైనా నయం చేయవచ్చు. కానీ ఆలస్యం చేస్తేనే అసలు సమస్య మొదలవుతుందని నిపుణులు అంటున్నారు.
భయపెట్టడం కాదు.. అప్రమత్తం చేయడం!
రెండు వారాల నిబంధన ప్రజలను భయపెట్టడానికి కాదని, వారిని బాధ్యతాయుతంగా మెలిగేలా మార్చడానికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగ లక్షణాలు కనిపించిన తొలి రోజుల్లోనే వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల చికిత్స సులభతరం అవుతుంని, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే తిరిగి ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం
చివరగా, శరీరం ఇచ్చే సంకేతాలను మనం అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటప్పుడు అనవసరమైన ఆందోళన చెందకుండా.. ప్రాణాల మీదకు వచ్చే వరకు వేచి చూడకుండా ఉండటమే వివేకమని చెబుతున్నారు. సకాలంలో తీసుకునే నిర్ణయం ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని అంటున్నారు. ఆరోగ్యం విషయంలో తీసుకునే చిన్నపాటి జాగ్రత్త కూడా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి నుంచి కాపాడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: విపత్తు హెచ్చరికలు.. ఆ జీవులకు చిటికెలో పని!


