నిశ్శబ్దంగా ప్రాణాలు తీస్తున్న మానసిక వ్యాధులు
కుటుంబ కలహాలు, ఆర్థిక కష్టాలు, పనిఒత్తిడులే కారణం
చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.
కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి
ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు.
ఆత్మహత్యలు... చివరి ఫలితం
ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.
ఒత్తిడికి లోనుకావొద్దు...
తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్ఫోన్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి.
– దినేష్, మానసిక వైద్య నిపుణులు, చిత్తూరు
సెల్ఫోన్.. చేతిలో ఉన్న విషం
సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తూ మనుషులు తెలియకుండానే మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారు. వాస్తవ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతూ ఒంటరితనాన్ని పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా పోలికలు, అవమానాలు, నెగెటివ్ కంటెంట్ యువత మనస్సును చిదిమేస్తోంది. దీనికితోడు ఒంటరి జీవనం పెరిగిపోవడంతో కొందరు మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఇవి సమస్యలకు పరిష్కారం కాదని తెలిసినా, తాత్కాలిక ఉపశమనానికి అలవాట్లలో చిక్కుకుపోతున్నారు. చివరకు మానసిక, శారీరక, ఆర్థికంగా పూర్తిగా కుమిలిపోతున్నారు. ఇక ఒకప్పుడు కుటుంబాలతో కలిసి మెలిసి జీవించిన సమాజం ఇప్పుడు విడిపోయింది. మాట్లాడే మనుషులు లేరు. వినే చెవులు లేవు. బాధను పంచుకునే వారు లేక అనేక మంది లోలోపలే కుంగిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా మానసిక రుగ్మతలు వ్యాపిస్తున్నాయి.


