సుప్రీంకోర్టులో సుంకాల సమరంలో విజయం సాధించిన లాయర్ నీల్ కత్యాల్
చిన్న వ్యాపారుల తరఫున వాదించి గెలిచిన కత్యాల్
న్యూయార్క్: ప్రపంచ దేశాలపై సుంకాల సుత్తితో మోదిన అధ్యక్షుడు ట్రంప్ను తప్పుబడుతూ అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు వెనుక భారతీయమూలాలున్న న్యాయవాది నీల్ కత్యాల్ కృషి సైతం దాగి ఉంది. ట్రంప్ అధిక సుంకాల విధానాలతో వ్యాపారం దారుణంగా దెబ్బతింటోందని కొత్తగా పెంచిన టారిఫ్లను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో కేసులు వేసిన అమెరికా చిరు వ్యాపారుల తరఫున లాయర్ నీల్ కత్యాల్ వాదించి నెగ్గారు.
కేసు గెలిచాక నీల్ శుక్రవారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో విజయం అని ఒక పోస్ట్పెట్టారు. తర్వాత ఎంఎస్నౌకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ అమెరికా వ్యవస్థలోని గొప్పతనాల్లో ఒకటి నేడు అందరికీ కన్పించింది. వలసదారుల సంతానమైన నేను నేరుగా సుప్రీంకోర్టులో చిరువ్యాపారుల తరఫున వాదించా. అధ్యక్షుడు చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారని గట్టిగా చెప్పా. బలంగా ప్రశ్నించే అవకాశం ప్రభుత్వ లాయర్లు ఇచ్చా.
ఇరువైపులా గట్టి వాదనలే జరిగాయి. చివరకు మాకు అనుకూలంగానే జడ్జీలు ఓటేశారు. మేమే గెలిచాం. అధ్యక్షుడు అత్యంత శక్తివంతుడై ఉండొచ్చేమోగానీ రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు’’ అని అన్నారు. ‘‘టారిఫ్లను తప్పుబడుతూ అమెరికా సుప్రీంకోర్టు చట్టానికి అండగా నిలబడింది. ప్రతి ఒక్క అమెరికన్కూ భరోసా ఇచ్చింది. తీర్పు ద్వారా కోర్టు ఒక చక్కటి సందేశం ఇచ్చింది. అదేంటంటే దేశాధ్యక్షుడు శక్తివంతమైన నేత. కానీ రాజ్యాంగం అంతకంటే శక్తివంతమైంది.
అమెరికాలో ఉభయ చట్టసభలు(కాంగ్రెస్) మాత్రమే అమెరికన్లపై పన్నులు మోపగలదు. ఈ చట్టపర కేసు ద్వారా మనమేం కోరవచ్చో సుప్రీంకోర్టు పరోక్షంగా వెల్లడించింది. ఈ న్యాయపోరాటంలో లిబర్టీ జస్టిస్ సెంటర్ నాయకత్వం ట్రంప్కు ఎదురునిలిచి పోరాడింది’’ అని కొనియాడారు. ‘‘ అధ్యక్షుడిగా ఎవరున్నాసరే అధ్యక్ష స్థానం అధికారాల పరిధిని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది రాజకీయాలు చేయాల్సిన సందర్భంగా కాదు. గత రెండున్నర శతాబ్దాలుగా అత్యంత మౌలిక విలువలను పరిరక్షిస్తూ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు పెద్దన్నలా వ్యవహరిస్తోంది’’ అని అన్నారు.
క్లర్క్.. లాయర్.. ప్రొఫెసర్.. సొలిసిటర్ జనరల్..
1970లో కత్యాల్ అమెరికాలోని షికాగోలో జన్మించారు. నీల్ తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే భారత్ నుంచి అమెరికాకు వలసవెళ్లారు. తల్లి పిల్లల వైద్యురాలుకాగా తండ్రి ఇంజనీర్. యేల్ న్యాయ విశ్వవిద్యాలయంలో నీల్ లా చదివారు. గతంలో యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్(సెకండ్ సర్క్యూట్)లో గీడో కలాబ్రెసోకు క్లర్క్గా పనిచేశారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ జి.బ్రేయర్కు సహాయకునిగా సేవలందించారు.
జార్జ్టౌన్ యూనివర్సిటీ లా సెంటర్లో 20 సంవత్సరాలకుపైగా న్యాయశాస్త్ర అధ్యాపకునిగా పాఠాలు బోధించారు. అత్యంత పిన్నవయసులో ఇన్నేళ్లు లా ప్రొఫెసర్గా కొనసాగిన అతికొద్ది మందిలో ఈయన కూడా ఒకరని యూనివర్సిటీ పొగిడింది. హార్వార్డ్, యేల్ న్యాయ విశ్వవిద్యాలయాల్లో నీల్ విజిటింగ్ ప్రొఫెసర్గానూ పనిచేస్తున్నారు. నీల్ గతంలో అమెరికా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో తాత్కాలిక సొలిసిటర్ జనరల్గా సేవలందించారు.
1998–99 కాలంలో డెప్యూటీ అటార్నీ జనరల్కు ప్రత్యేక సహాయకునిగా ఉన్నారు. తర్వాత న్యాయశాఖలోని డెప్యూటీ అటార్నీ జనరల్ ఆఫీస్లో జాతీయ భద్రతా సలహాదారుగా సేవలందించారు. మిల్బ్యాంక్ ఎల్ఎల్పీ వారి వాషింగ్టన్ డీసీ ఆఫీస్లో నీల్ భాగస్వామిగా కొనసాగుతున్నారు. లిటిగేషన్ అండ్ ఆర్బిట్రేషన్ గ్రూప్లో సభ్యునిగా ఉన్నారు. నీల్ ఇప్పటికేదాకా సుప్రీంకోర్టులో 54 కేసులు వాదించారు. 2011లో న్యాయశాఖ ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘ఎడ్మాండ్ రాన్డాల్ప్’ను అందుకున్నారు. 2011, 2014లో అమెరికా సుప్రీంకోర్టు నీల్ను ఫెడరల్ అప్పీలేట్ రూల్స్ అడ్వజరీ కమిటీకి ఎంపికచేసింది.


