ఎస్ఐఆర్ తర్వాత తుది జాబితా ముద్రించిన ఈసీ
తాజా ఓటర్ల సంఖ్య 2.69 కోట్లుగా నిర్ధారణ
తిరువనంతపురం: కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే తర్వాత తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ముద్రించింది. 9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ తుది జాబితాను ముద్రించారు. దీంతో తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య 2.69 కోట్లు దాటింది. http:// electoralsearch.eci.gov.in వెబ్సైట్లో కేరళ ఓటర్లు తమ పేరును సరిచూసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గత ఏడాది అక్టోబర్లో ఎస్ఐఆర్ సర్వే మొదలెట్టక ముందు 2,78,50,855 ఓటర్లు ఉండగా తుది జాబితాలో 2,69,53,644 మందికి చోటు దక్కిందని ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్లో ఓట్ల ప్రక్షాళన తర్వాత 8,97,211 పేర్లు తొలగించారు. తాజాగా కేరళ మొత్తం ఓటర్లలో పురుషులు 1,31,26,048 మంది ఉండగా మహిళలు 1,38,27,319 ఉన్నారు. ట్రాన్స్జెండర్లు కేవలం 277 మంది ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న ఓటర్ల సంఖ్య 2,23,558గా తేలింది.
సరీ్వస్ ఓటర్ల సంఖ్య 54,110కు చేరుకుంది. తప్పులు, సవరణలు, ఇతరత్రా కారణాలతో వివరణ కోరుతూ 36.88 లక్షల ఓటర్లకు నోటీస్లు జారీచేశామని వీళ్లలో 53,229 మంది పేర్లను తనిఖీ తర్వాత చేర్చామని ఈసీ పేర్కొంది. తుది జాబితాను వెరిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలకూ అందజేయనున్నారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరితేదీలోపు వరకూ ఓటర్ల జాబితాలోకి కొత్త ఓటర్లను చేర్చేందుకు ఆస్కారముందని ఈసీ అధికారులు స్పష్టంచేశారు.


