ఏఈఆర్ఓలకు సీఈవో శిక్షణ
హైదరాబాద్: ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి మెదక్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సహాయ ఎన్నికల నమోదు అధికారులకు (ఏఈఆర్ఓలు) ఆన్లైన్ శిక్షణ నిర్వహించారు.
మొత్తం 195 మంది ఏఈఆర్ఓలు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఓటరు జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణ అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.

రాబోయే ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహకాలను సమయానికి పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితాల స్వచ్ఛతను కాపాడటంలో ఏఈఆర్ఓల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అధికారులు తెలిపారు.


