తిరునంతపురం: కేరళ ప్రభుత్వం మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలో తొలిసారిగా వైకోమ్ పట్టణంలో సోలార్తో నడిచే పడవల్ని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా కేరళ ప్రభుత్వం పర్యావరణహిత రవాణా రంగంలో కీలక అడుగు వేసినట్లైంది.
కేరళ.. ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగా కేరళలో సరస్సులు, కాల్వలు, సముద్రతీరపు నీటి మార్గాలు ఎక్కువ. అందుకే అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పని సరి. అదే సమయంలో కొబ్బరిపీచు, జీడిపప్పు, ఇటుక తయారీ, చేపల వేట వంటి సంప్రదాయ వృత్తులు సైతం నీటి మార్గాల పక్కన ఎక్కువగా ఉండంటం వల్ల రవాణా అవసరాలు పడవల ద్వారా జరుగుతుంటాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పర్యావరణహిత రవాణా మార్గంగా పడవ ప్రయాణాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దింది.
ఇందులో భాగంగా వైకోమ్ పట్టణంలో ఇంధనంతో నడిచే పడవల స్థానంలో సోలార్తో నడిచే పడవల్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సి.బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. వైకోమ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హబ్గా అవతరించింది. ఇది కేరళ పర్యావరణహిత రవాణా రంగానికి మరో కలికితురాయి’అని పేర్కొన్నారు.
ఇక ఈ జల రవాణా కేంద్రంలోని ఒక్కో పడవలో 75 మంది ప్రయాణించొచ్చు. 3.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పడవలు 80 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో నడుస్తాయి. మొత్తం 10.8 కిలోమీటర్ల మార్గంలో ఈ పడవలు సేవలు అందించనున్నాయి. రోజుకు 15 ప్రయాణాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి, పర్యాటక రంగానికి కూడా ఊతం లభించనుంది. 2017లో వైకోమ్లో మొదటి సౌర పడవను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిగా సౌరశక్తి ఆధారితంగా మారడం కేరళలో స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.


