ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి | Bone diseases Record Breaks In 30 Years | Sakshi
Sakshi News home page

ముప్పై ఏళ్లకే గుల్లబారుతున్నాయి

Feb 28 2026 6:23 AM | Updated on Feb 28 2026 6:23 AM

Bone diseases Record Breaks In 30 Years

మహిళల ఆరోగ్యంలో ఎముకల క్షీణత (ఆస్టియో పోరోసిస్‌) ఒక ప్రధాన సంక్షోభంగా మారుతోంది. ఒకప్పుడు మెనోపాజ్‌ దాటిన మహిళల్లో మాత్రమే కనిపించే ఈ వ్యాధి నేడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ప్రీ–మెనోపాజల్‌ ఆస్టియో పోరోసిస్‌గా పిలిచే ఈ ఎముకల బలహీనత గత దశాబ్దంతో  పోలిస్తే గణనీయంగా పెరిగిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

30 ఏళ్లకే...
ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను (బోన్‌ డెన్సిటీ) 25 నుంచి 30 ఏళ్ల మధ్యే సాధిస్తుంది. ఒకసారి 30 ఏళ్లు దాటాక, కొత్త ఎముక ఏర్పడే వేగం కంటే పాత ఎముక అరిగి పోయే వేగం పెరుగుతుంది.

80%
భారతదేశంలో సుమారు 6.1 కోట్ల మంది ఆస్టియో పోరోసిస్‌తో బాధపడుతున్నారు. వీరిలో సుమారు 80% మంది మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశం.

20–25%
పట్టణ ప్రాంతాల్లో నివసించే 30 ఏళ్ల పైబడిన మహిళల్లో సుమారు 20% నుంచి 25% మందికి ఆస్టియో పీనియా (ఎముకలు పల్చబడటం – ఇది ఆస్టియో  పోరోసిస్‌కు ముందు దశ) ఉన్నట్లు గుర్తించారు.

70–80%
∙భారతదేశంలోని మెట్రో నగరాల్లో 30 ఏళ్ల మహిళల్లో దాదాపు 70% నుంచి 80% మంది విటమిన్‌–డి లోపంతో బాధపడుతున్నారు. ఇది ఎముకలు కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.

50 ఏళ్లు
∙50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఎముక విరుపునకు గురవుతున్నారు.

15%
∙ఒక మహిళ తన జీవితంలో అత్యధిక ఎముక సాంద్రతను 30 ఏళ్ల నాటికి చేరుకోవాల్సి ఉన్నా.. సరైన  పోషకాహారం లేక పోవడం వల్ల 15% మంది మహిళలు అసలు గరిష్ట సాంద్రతను చేరుకోవడంలో విఫలమవుతున్నారు, దీనివల్ల వీరికి 45 ఏళ్లకే ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతోంది.

20%
∙మెనోపాజ్‌ ప్రారంభమైన మొదటి 5 నుంచి 7 ఏళ్లలోనే మహిళలు తమ శరీరంలోని మొత్తం ఎముక ద్రవ్యరాశిలో 20% వరకు కోల్పోతున్నారు.

2040
∙ప్రస్తు్తతం 30 ఏళ్ల వయసులో ఉన్న మహిళలు, తమ ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, 2040 నాటికి దేశంలో హిప్‌ ఫ్రాక్చర్ల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

21.2%
∙ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లు పైబడిన మహిళల్లో సుమారు 21.2% మందికి ఆస్టియో పోరోసిస్‌ ఉంది

ముందు జాగ్రత్తలే ముఖ్యం
∙ప్రతిరోజూ శరీరానికి కాల్షియం అందేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, రాగులు వంటివి తీసుకోవాలి ∙రోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాల పాటు సహజమైన ఎండ తగిలేలా చూసుకోవాలి ∙కేవలం నడక సరి పోదు, ఎముకలపై ఒత్తిడి కలిగించే వెయిట్‌–బేరింగ్‌ వ్యాయామాలు, యోగా ఉండేట్లు చూసుకోవాలి ∙50 ఏళ్లు దాటిన మహిళలు, ప్రమాద సూచనలు ఉన్నవారు తప్పనిసరిగా బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ చేయించుకోవాలి.

ఎముకల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం కేవలం వృద్ధాప్యంలోనే కాదు, యవ్వనం నుంచే ప్రారంభమవడం ఎంతో ముఖ్యం. అందుకోసం తగిన  పోషకాహారం తీసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement