పరిశోధనల్లో దారి దీపాలు | Inspiring womens stories of science and talents, sakshi special | Sakshi
Sakshi News home page

పరిశోధనల్లో దారి దీపాలు

Feb 28 2026 6:06 AM | Updated on Feb 28 2026 6:06 AM

Inspiring womens stories of science and talents, sakshi special

నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం

ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే 

‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ 
అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.
సైన్స్‌లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తి
తోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.

ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు 
మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్‌ అనేది పురుషుల రంగం’ అనే మాటకు
కాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. 
సైన్స్‌ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...

శాస్త్రరంగంలో ‘షా’జీ
ఆదిత్య ఎల్‌ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్‌ 1 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నిగర్‌ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్‌ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్‌ మిషన్‌’కు అధ్యయన డైరెక్టర్‌గా, రిసోర్సెస్‌–2 ఏకి అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్‌ ‘ఆత్య–ఎల్‌1’కి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా సేవలందించడం ఆమె కెరీర్‌లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్‌ కంప్రెషన్, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌లపై రచనలు చేశారు.

ఆకాశదేశాన...
చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ డైరెక్టర్‌గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్‌.

సైంటిఫిక్‌ ఫిలాసఫీ
కంప్యుటేషనల్‌ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్‌ లెర్నింగ్, బయో ఇన్‌ఫర్‌మేటిక్స్‌లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) తొలి మహిళా డైరెక్టర్‌గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్‌ మినిస్టర్స్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అడ్వైజరీ కౌన్సిల్‌లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్‌ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌’ విభాగంలో ఇన్ఫోసిస్‌ ప్రైజ్, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డ్‌లు గెల్చుకున్నారు.

 .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.

అప్పుడే మహిళల పురోగతి
గౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్‌ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్‌డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌లో బయో–ఇంక్యుబేషన్‌ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్‌ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్‌లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.
– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ 
అండ్‌ హెడ్‌–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌

వారి ప్రోత్సాహమే నా బలం
సైన్స్‌ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్‌లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్‌సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో నా కెరీర్‌ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్‌డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.
– డాక్టర్‌ సుధా కళ్యాణి, సీనియర్‌ మేనేజర్‌ అండ్‌ హెడ్, 
లైఫ్‌ సైన్స్‌ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్‌ పార్క్‌

కాదంబిని గంగూలీ
కలకత్తా మెడికల్‌ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్‌గా చరిత్ర సృష్టించారు.

మేరీ పూనెన్‌ లూకోస్‌
భారతదేశంలో తొలి మహిళా సర్జన్‌ జనరల్‌ మేరీ పూనెన్‌ లూకోస్‌. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.

ఆనందీ బాయి జోషి
పాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్‌కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.

జానకీ అమ్మాల్‌
ఎడవలత్‌ కక్కట్‌ జానకి అమ్మాల్‌ ప్రసిద్ధ బోటనిస్ట్‌. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్‌లోని సెంట్రల్‌ బొటానికల్‌ లేబొరేటరీ తొలి డైరెక్టర్‌ (1952)

కమలా సోహోనీ
కమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్‌డీ చేసిన తొలి మహిళ.

అసిమా ఛటర్జీ
అసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్‌ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్‌లో డాక్టరేట్‌ పొందిన తొలి మహిళ.
కమల్‌ జయసింగ్‌ రణదివే
కమల్‌ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్‌ పరిశోధకురాలు. ఇండియన్‌ ఉమెన్‌ సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో తొలిసారిగా టిష్యూ కల్చర్‌ రిసెర్చ్‌ ల్యాబ్‌ని ప్రారంభించారు.

బీబా చౌదరి
భారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.

పూర్ణిమా సిన్హా
భౌతికశాస్త్రంలో డాక్టరేట్‌ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్‌–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.

అన్నా మణి
అన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్‌ ఎనర్జీ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి విశేష కృషి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement