62% పీఠాల్లో చైర్పర్సన్, మేయర్ స్థానాల్లో అతివలు
పుర పోరులో మహిళా ప్రభంజనం
జనరల్ కేటగిరీలోనూ మహిళలకు దక్కిన అవకాశం
పాలనలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే మరింత రాజకీయ భవిష్యత్తు
రాష్ట్రంలో మొత్తంమీద బీసీలకు 58 శాతం పదవులు
సాక్షి, హైదరాబాద్: పురపోరులో మహిళలు ప్రభంజనం సృష్టించారు. రాష్ట్రంలో పురపాలనను వారు శాసించనున్నారు. అతివలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్పర్సన్ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లలో మాత్రం రిజర్వ్ చేసిన మూడు స్థానాల్లోనే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు, మహిళలకు ఇతర రంగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సోమవారం నిర్వహించిన చైర్పర్సన్/మేయర్ ఎన్నికల ఫలితాల్లో 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 64 శాతం పదవులను మహిళలు దక్కించుకున్నారు. వారు ఏకంగా 72 చోట్ల పురపాలన పగ్గాలు చేపట్టారు. అయితే, ఎన్నికలు వాయిదా పడిన మరో 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే మహిళలకు 4 రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారు 76 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు అవుతుంది. అంటే దాదాపు 62 శాతం పదవులను దక్కించుకున్నట్లు అవుతుంది. మహిళలు వారికి కేటాయించిన 50 శాతం రిజర్వేషన్ల కంటే 12 శాతం అధికంగా పదవులు దక్కించుకుంటుండటం విశేషం.
చట్టసభల్లోనూ అమల్లోకి వస్తే..
మహిళలు తెరచాటు వ్యక్తులుగా కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో.. 2029లో చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే.. ఎంతమంది మహిళా రాజకీయ వేత్తలు చట్టసభలకు వెళ్తారనేది ఆసక్తికరం. చైర్పర్సన్లుగా ఎన్నికైన వారిలో విద్యాధికులు కూడా అధికంగా ఉండటం గమనార్హం. బీసీ, ఎస్సీ, అన్రిజర్వ్డ్ సీట్లలోనూ వారు విజయం సాధించడం గమనార్హం. వార్డు సభ్యుల ఎన్నికలోనూ వారు అన్రిజర్వ్డ్ సీట్లలో గెలుపొంది సత్తాచాటారు. రాష్ట్రంలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. రాజకీయ నాయకులు తమకు అవకాశం రానిచోట తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దించారు. అయితే అధికారం అందుకున్న తరువాత పాలనపై తమదైన ముద్ర కనిపించాలంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే వారి భవిష్యత్తు రాజకీయంగా మరింత ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
విద్యాధికులు
చైర్పర్సన్/మేయర్ స్థానాలు అధిరోహించిన మహిళల్లో విద్యాధికులూ ఉన్నారు. వీరిలో 8 మంది పీజీ చేసిన వారు ఉంటే.. 23 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారున్నారు. ఒక డాక్టర్ ఉన్నారు. అలాగే, టెన్త్, ఇంటర్ చదివిన వారూ ఉన్నారు.
బీసీలకు 58 శాతం పదవులు
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జోరుగా ఆందోళన జరగడం, అది చట్టబద్ధత సాధించడానికి అనేక అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో 112 చైర్పర్సన్/మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు 58.03 శాతం పదవులు దక్కాయి. ఇందులో ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా 22 పదవులు దక్కగా.. ఆ తరువాత గౌడ్లకు 8, ముదిరాజ్లకు 7, యాదవ సామాజిక వర్గానికి 5 చైర్పర్సన్ పదవులు లభించాయి. వీరు కాకుండా లింగాయత్. బెస్త, పద్మశాలి, స్వర్ణకారులు, బోయ, తేలి, కురుమ, రెడ్డిక సామాజిక వర్గాల వారూ ఉన్నారు.


