నాలుగు లైన్ల ‘గ్రాండ్‌’ కారిడార్‌ | Vijayawada-Kazipet third-line project nearing completion | Sakshi
Sakshi News home page

నాలుగు లైన్ల ‘గ్రాండ్‌’ కారిడార్‌

Feb 17 2026 12:40 AM | Updated on Feb 17 2026 12:40 AM

Vijayawada-Kazipet third-line project nearing completion

విజయవాడ–కాజీపేట–బల్లార్షా మధ్య త్వరలో నాలుగో లైన్‌ నిర్మాణం 

దక్షిణ–ఉత్తర భారత్‌లను జోడించే ప్రధాన రైల్వే లైన్‌కు మహర్దశ 

ప్రస్తుతం తుది దశలో మూడో లైన్‌ నిర్మాణ పనులు

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ–ఉత్తర భారత్‌లను రైల్వే మార్గంతో జోడించే కీలక గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లో నాలుగో లైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే అత్యంత బిజీ మార్గాల్లో ఇది ఒకటి. నిత్యం 160 రైళ్లు తిరిగే ఈ మార్గం పూర్తిస్థాయి పరిమితికి చేరుకోవడంతో కొత్త రైళ్లను నడపడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మూడో లైన్‌ను నిర్మిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఆ పనులు పూర్తి కానున్నాయి. దీంతో ఆ రూట్‌లో అదనంగా మరో 100 రైళ్లు నడిపేందుకు వెసులుబాటు కలిగింది. ఇక్కడితో ఆగిపోకుండా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మార్గంలో నాలుగో లైన్‌ను కూడా నిర్మించాలని నిర్ణయించింది. అధికారికంగా దీనికి మంజూరు ఇవ్వనప్పటికీ సర్వే పనులను ప్రారంభించి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు నాలుగో లైన్‌ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు ఖర్చవుతాయని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. డీపీఆర్‌ పూర్తయ్యాక ఖర్చు విషయంలో మరింత స్పష్టత రానుంది.  

ప్రస్తుతం ఈ మార్గంలో మూడో లైన్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. బల్లార్షా–కాజీపేట మధ్య 201 కి.మీ. మూడో లైన్‌ ఇప్పటివరకు 183 కి.మీ. మేర పూర్తయింది. మిగతాది పురోగతిలో ఉంది. బెల్లంపల్లి – మందమర్రి – ఆసిఫాబాద్‌ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య పనులు జరుగుతున్నాయి. దీనికి రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాజీపేట–విజయవాడ మధ్య 219 కి.మీ. మేర పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 195 కి.మీ. పూర్తయ్యాయి. డోర్నకల్‌–మహబూబాబాద్‌ మధ్య 24 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి. దీనికి రూ. 3,300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి కానున్నాయి. ఇది దేశంలోనే ప్రధాన కారిడార్‌ అయినందున భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను భారీగా పెంచాలనేది కేంద్రం ఆలోచన.

ప్రయాణికుల రైళ్లతోపాటు సరుకు రవాణా రైళ్లను విస్తృతంగా తిప్పాలని భావిస్తోంది. ప్రస్తుతం 424 కి.మీ. మేర నాలుగో లైన్‌ కోసం సర్వే జరుగుతోంది. మరో మూడు నెలల్లో డీపీఆర్‌ పూర్తి చేసి ప్రాజెక్టు పనులను పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. భూసేకరణలో జాప్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వేగంగా కొలిక్కి తెచ్చి నిధుల సమస్య రాకుండా పనులను పరుగెత్తించాలని భావిస్తోంది. ఇది పూర్తయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో రైళ్లు తిరిగేందుకు వీలు కలుగుతుంది.

ఈ కారిడార్‌ పరిధిలో సిమెంటు పరిశ్రమలు, బొగ్గు గనులు ఉన్నందున వాటి ఉత్పత్తుల తరలింపు భారీగా పెరగనుంది. వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, ఎరువుల సరఫరా మెరుగవనుంది. రైల్వేకు దీని వల్ల భారీ ఆదాయం లభించనుంది. ఇక ప్రస్తుతం గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌ దేశ రైలు అవసరాల్లో 40 శాతం తీరుస్తోంది. ఈ మార్గంలో భవిష్యత్తులో సెమీ హైస్పీడ్‌ రైళ్ల సంఖ్య భారీగా పెరగనున్న నేపథ్యంలో ట్రాక్‌ను 180 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యంతో నిర్మించనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement