పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన వద్ద 50 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
నిల్వల లభ్యత ఇలా..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం ముడి చమురు 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజులకు సరిపోతాయి. మొత్తంగా 50 రోజుల వరకు ఎటువంటి సరఫరా అంతరాయం లేకుండా దేశ అవసరాలను తీర్చవచ్చు. ఇవి కాకుండా విశాఖపట్నం, మంగళూరు, పాడూరులోని వ్యూహాత్మక నిల్వల్లో 4.094 మిలియన్ టన్నుల ముడి చమురు సిద్ధంగా ఉంది. ఇది మన మొత్తం సామర్థ్యంలో (5.33 మెట్రిక్ టన్నులు) సుమారు 77 శాతానికి సమానం.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్..
భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ప్రతిరోజూ సుమారు 5.6 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులను దేశం వినియోగిస్తోంది. గతంలో దిగుమతుల్లో 40% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వచ్చేవి. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచి దిగుమతులు పెరగడంతో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా వచ్చే చమురు వాటా 50 శాతానికి చేరింది. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం ద్వారా సరఫరా సవాలుగా మారే అవకాశం ఉంది.
ప్రభుత్వ చర్యలు
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ‘మేము అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా చమురును సేకరిస్తున్నాం. రిఫైనరీలు అవసరమైనప్పుడు ఇతర వనరుల నుంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాయి’ అని ఒక అధికారి తెలిపారు.
ధరల పెంపు ఉంటుందా?
ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. అయితే, యుద్ధం 10-15 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 82 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎల్పీజీ పరిస్థితి ఏమిటి?
వంట గ్యాస్ విషయంలోనూ భారత్ ఊరటనిచ్చే సమాచారమే ఇచ్చింది. భారత్ వద్ద 25-30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. మనం 80-85% ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో 20.67 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంది. వచ్చే రెండు వారాల్లో పశ్చిమ ఆసియాలో పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతరాయాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇదివరకే రాజ్యసభలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు


