బలూచిస్తాన్: పాకిస్తాన్ ఆక్రమిత బలూచిస్తాన్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. పాక్ భద్రతా దళాలే లక్ష్యంగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) జరిపిన జంట దాడులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. పంజ్గుర్, తుర్బాత్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వ్యూహాత్మక దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించగా, భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడులకు తామే బాధ్యులమని బీఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రామ్ బెలూచ్ అధికారికంగా ప్రకటించారు.
పంజ్గుర్ జిల్లాలోని చిత్కాన్ ప్రాంతంలో ఉన్న ఫ్రాంటియర్ కోర్ (ఎఫ్సీ) ప్రధాన కార్యాలయంపై బీఎల్ఎఫ్ పోరాట యోధులు విరుచుకుపడ్డారు. కార్యాలయ ఆవరణలోని నిఘా విభాగం లక్ష్యంగా గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడటంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ దాడిలో నిఘా కార్యాలయాలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా, పలువురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మెరుపు దాడితో పాక్ రక్షణ దళాలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయాయి.
మరోవైపు తుర్బాత్ సమీపంలోని అబ్సర్ ప్రాంతంలో సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఎఫ్ మరో ఘాతుకానికి పాల్పడింది. కోహ్దా యూసఫ్ ప్రాంతం గుండా రెండు వాహనాలు, మోటార్ సైకిళ్లతో వెళ్తున్న పాక్ సైనిక బృందంపై రిమోట్ నియంత్రిత ఐఈడీ (ఐఈడీ) బాంబుతో దాడి చేశారు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన పాక్ దళాలు పరిసర ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ స్థానిక పౌరులను వేధింపులకు గురిచేస్తున్నాయని బీఎల్ఎఫ్ ఆరోపించింది.
ఈ దాడుల నేపథ్యంలో ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో పాక్ సైన్యం కఠినమైన కర్ఫ్యూను విధించింది. దీంతో మార్కెట్లు, వ్యాపార సముదాయాలు మూతపడటమే కాకుండా ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పాలు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న వేళ మానవతా దృక్పథంతో ఆంక్షలు సడలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘రాజ్యసభ’ బరిలో హేమాహేమీలు.. ఖరారు చేసిన బీజేపీ


