మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి రాఖాల్గూడ గ్రామంలో లకే పోడియామి అనే మహిళ హత్యకు గురైంది. హత్యను నిరసిస్తూ గత ఏడాది డిసెంబర్ ఏడు, ఎనిమిది తేదీల్లో యం.వి. 26 గ్రామంపై కొందరు వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఇళ్లను కాల్చివేసి ఆస్తులను తగలబెట్టారు. ఈ సమయంలో గ్రామంలో పర్యటించిన నాయకులు బాధిత కుటుంబానికి రూ. 75 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పరిహారంగా ఇస్తామన్నారు. అయితే గ్రామం మొత్తం నాశనం కావడంతో పరిహారాన్ని గతంలో ప్రకటించిన దానికంటే నాలుగు రేట్లు అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 4,65,47,269 రూపాయలను కేటాయించినట్టు మల్కన్గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు. పరిహారాన్ని త్వరలో జిల్లా కలెక్టర్ సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ్ పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే రాఖాల్గూడ గ్రామానికి చెంది.. హత్యకు గురైన లకే పోడియామి కుటుంబానికి కూడా పది లక్షల రూపాయలకు బదులు 20 లక్షల రూపాయలను అందజేస్తామన్నారు.


