రాయగడ: మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ శుభ్ర పండపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించనున్నట్లు కలెక్టర్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆరోజు ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో కౌంటింగ్ వివరాలను వీడియో ద్వారా నిక్షేపం చేసిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు సంబంధించి 19 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో తీర్మానానికి సంబంధించి కౌన్సిలర్ల ఓటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అయితే తనపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంలో ఏమాత్రం నిజం లేదని వైస్ చైర్పర్సన్ శుభ్రపండ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ హైకోర్టు ఆదేశానుసారం ఫలితాలను వెల్లడించలేదు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ను స్థానిక ట్రెజరీలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న సమక్షంలో భద్రపరిచారు. ఏదిఏమైనప్పటికీ ఈనెల 11వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఇప్పటికే శుభ్రపండకు వ్యతిరేకంగా 19 మంది కౌన్సిలర్లు ఓటింగ్ వేసిన సంగతి అందరికీ తెలిసినప్పటికీ, అధికారికంగా శుభ్ర పండ వైస్ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగించే విషయంలో ఫలితాలు వెల్లడిస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.


