గార : ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఆరు నెలల కిందట తల్లిని, వారం క్రితం తండ్రిని మృత్యువు కబళించింది. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చింది. గార మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన శిర్ల చిన్నారావు, చిన్నమ్మడుల దంపతులకు పవన్కుమార్, మౌనిక ఇద్దరు పిల్లలున్నారు. చిన్నమ్మడు ఆరునెలల క్రితం దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి చిన్నారావే అన్నీ తానై పిల్లలను పెంచుతున్నాడు. ఇంతలో గత బుధవారం గుండెపోటుకు గురికావడంతో చిన్నారావు మృతి చెందాడు. అరునెలల వ్యవధిలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో అన్నాచెల్లెళ్లు దిక్కుతోచని స్థితిల్లో పడ్డారు. పెదనాన్న, చిన్నాన్న సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవ్వడం, మరోవైపు విషాదంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలున్నారు. పవన్కుమార్ అంపోలు బీసీ హాస్టల్లో పదో తరగతి, మౌనిక పాతపట్నం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అనాథలైన ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యమున్నా ఆర్థికంగా అండగా నిలిచేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 8309396387 నంబరుకు సంప్రదించాలని చిన్నాన్న శిర్ల రాము విజ్ఞప్తి చేస్తున్నారు.


