చిరు వ్యాపారాలకు చిక్కులు..!
● ఫుట్పాత్ వ్యాపారాలు తొలగిస్తున్న అధికారులు ● ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొదలుకొని పాత జాతీయ రహదారి మీదుగా రోడ్డుకు ఆనుకుని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందినవారు వివిధ రకాల ఫుట్పాత్ వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత కొన్ని దశాబ్ధాలుగా చిన్నపాటి వ్యాపారాలతో జీవనం సాగిస్తూ వచ్చారు. అయితే గత కొద్దిరోజుల నుంచి పట్టణంలో అభివృద్ధి పేరుతో ఫుట్పాత్ వ్యాపారాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా వైఎస్సార్ జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి ఫుట్పాత్ వ్యాపారాలను తొలగించారు. పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఫుట్పాత్ వ్యాపారస్తులకు ఆసరాగా ఉన్నటువంటి షెల్టర్ను కూల్చివేశారు. తాజాగా ఆర్టీసీ కాంప్లెక్స్కు ఎదురుగా పాత జాతీయ రహదారికి ఆనుకుని బడ్డీలు ఏర్పాటు చేసుకున్నవారిని సైతం అక్కడ నుంచి వెళ్లగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో చిరు వ్యాపారాలతో కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. అధికార యంత్రాంగం చర్యలపై బాధితులతో కలిసి దశల వారీగా ఉద్యమాలు చేయడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీధి వ్యాపారాలను ప్రోత్సహించడానికి రుణాలు ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు.
మారుమూల ప్రాంతంలో స్థలం గుర్తింపు
అధికారుల గుర్తింపు ప్రకారం పట్టణంలో సుమారు 250 వరకు వివిధ రకాల ఫుట్పాత్ వ్యాపారస్తులు ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం సుమారు 400లకు పైగా కుటుంబాలు ఫుట్పాత్ వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తొలగించిన ఫుట్పాత్ వ్యాపారస్తుల కోసం చిన్న బజారులో పశువైద్య కేంద్రానికి పక్కన కొంత స్థలాన్ని గుర్తించారు. అయితే ఆ మారుమూల ప్రాంతంలో వ్యాపారాలు జరగవని నిరాకరిస్తూ బాధిత వ్యాపారస్తులు ఆ ప్రదేశానికి వెళ్లడం లేదు. వీటితో పాటు ఇదే ప్రాంతంలో కూరగాయల కాంప్లెక్స్లో కొన్ని దుకాణాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, వారి మాటలను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
చిరు వ్యాపారాలకు చిక్కులు..!


