సామాజిక పురోగతికి పాటుపడాలి
కవిటి: రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన ప్రజల పురోగతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని వక్తలు అన్నారు. మండలంలో కొత్త కొజ్జీరియా జంక్షన్లోని రెడ్డిక సంఘం భవనం వద్ద ఐక్యతా స్థూపం, యోగి వేమనల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం, పూరీ, గంజాం రెడ్డిక మహాజన పురోభివృద్ధి సంఘం తొలిసారి రిజిస్ట్రేషన్ చేసి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్డిక కుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వందేళ్ల ప్రయాణంలో విశేష సేవలందించిన దివంగత ఎమ్మెల్యేలు ఆశి నీలాద్రిరెడ్డి, ఉప్పాడ రంగబాబు, లండ కారయ్యరెడ్డి, దక్కత అచ్చుతరామయ్యరెడ్డిలు చిరస్మరణీయులని కొనియాడారు. అనంతరం పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో పూరీ, గంజాం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని రెడ్డిక సామాజికవర్గ ప్రజలు పాల్గొన్నారు.
పక్కాగా డోలోత్సవం ఏర్పాట్లు
గార: మార్చి 3, 4, 5 తేదీల్లో శ్రీకూర్మనాథాలయంలో జరిగే డోలోత్సవం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు సూచించారు. ఆదివారం విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ భవనంలో కూర్మనాథాలయ పాలక మండలి సమావేశం ఈవో టి.వాసుదేవరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అశోక గజపతిరాజు మాట్లాడుతూ క్యూలైన్లు, ఉత్సవం వేళ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండిగో సంస్థ సీఎస్ఆర్ నిధులు తొలి విడతగా ఇచ్చిన రూ.3.60 కోట్లతో పుష్కరిణి అభివృద్ధి పనులపై చర్చించారు. అదేవిధంగా అన్నదానం భవనం వద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లును ఆదా చేయవచ్చని నిర్ణయం చేశారు. సమావేశంలో అర్చకులు కిషోర్ బాబు, సభ్యులు కై బాడి కుసుమకుమారి, పల్ల పెంటయ్య, గంట్రేడి సంయుక్త, గొండు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చందు వైద్యానికి జీఎంఆర్ చేయూత
జి.సిగడాం: మండల పరిధిలోని డీఆర్వలస(దాలెమ్మ రాజువలస) గ్రామానికి చెందిన నారాయణరావు, భూలక్ష్మి దంపతుల కుమారుడు చందు గత ఐదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వైద్యానికి సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని జనవరి 28వ తేదీన ప్రాణ భిక్షపెట్టండి అనే శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి జీఎంఆర్ సంస్థ స్పందించింది. చందు వైద్యం నిమిత్తం రూ.3 లక్షల ఆర్థిక సాయం ఆదివారం అందజేసింది. కార్యక్రమంలో సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ కుమరాపు రమేష్నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, కుమరాపు పెద్ద శ్రీనివాసరావు, కుమరాపు నాగభూషణరావు, మాజీ సర్పంచ్ కుమరాపు అప్పలనాయుడు, విశ్రాంత వీఆర్వో కుమరాపు సన్యాసినాయుడు, పాండ్రంగి సీతారాం, పాండ్రంగి జానీ, కుమరాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరింతమంది దాతలు ముందుకు రావాలని కోరారు.
చికిత్స పొందుతూ
వివాహిత మృతి
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలోని సాయి నగర్కు చెందిన మెండ సీత(55) కాలిన గాయాలతో చికిత్స పొందుతూ రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారు. శనివారం దేవుడి వద్ద దీపం వెలిగిస్తున్న సమయంలో హారతి కర్పూరం బిల్లలు శరీరంపై పడడంతో సీత గాయాలకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలో ప్రథమ చికిత్స చేయించి, అనంతరం రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సీత ఆదివారం సాయంత్రం మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బలివాడ గణేష్ తెలిపారు.
సామాజిక పురోగతికి పాటుపడాలి
సామాజిక పురోగతికి పాటుపడాలి
సామాజిక పురోగతికి పాటుపడాలి


