నందపూర్ సమితిలో కలెక్టర్ పర్యటన
కొరాపుట్: ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్ కాలినడకన నదులు దాటారు. శనివారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితిలో పర్యటించారు. ఆ ప్రాంతంలో బస్కి నదిపై వంతెన నిర్మించాలని గత కొంత కాలంగా గిరిజనులు ఎన్నికలు బహిష్కరిస్తున్నారు. ఈ సమస్య తెలుసుకోవడానిని కలెక్టర్ స్వయంగా నదిని నడుచుకుంటూ దాటారు. నది అవతల ఉన్న బెబసానందగుడ గ్రామ గిరిజనులతో సమావేశమయ్యారు. వర్షాకాలం తాము నది దాటలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనారోగ్యం చేస్తే వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. తమ పిల్లలు పాఠశాలలకు వెళ్లడం లేదని, అంగన్వాడీ కేంద్రాలు నడవడం లేదని వాపోయారు. కనీస ఉపాధి లేక విలవిలలాడుతున్నామని వాపోయారు. కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరలో వంతెన నిర్మాణం ప్రారంభం అవుతుందని హామీ ఇచ్చారు.


