బాల్య వివాహాలతో అనర్థం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టేందుకు జిల్లా పాలనాధికారి కార్యాలయం వద్ద చైతన్య రథాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ చైతన్య రథం వందరోజులపాటు జిల్లాలో గుమ్మా, ఆర్.ఉదయగిరి సమితిల్లో మారుమూల గ్రామాల్లో ప్రచారం చేసి బాల్యవివాహాలు రద్దుకు ప్రజల్లో చైతన్యం తెస్తోందని జిల్లా కలెక్టర్ అగర్వాల్ తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గనియా ఉన్నయన్ కమిటీ సంస్థ సభ్యులతోపాటు ఐ.ఎస్.ఆర్.డి డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వర చౌదరి, సఖీ ఒన్ స్టాప్ సెంటర్ సభ్యులు మధుస్మితా సాహు, తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన..
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా సభాగృహంలో బాల్య వివాహాల నివారణ చట్టాలపై అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ కోర్టు జయపురం రిజిస్ట్రార్, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ ఇన్చార్జి కార్యదర్శి విష్ణు ప్రసాద్ దేవత హాజరయ్యారు. జాతీయ న్యాయ సేవా అథారిటీ రూపొందించిన ‘ఆశా –అవగాహన–మద్దతు– సహాయం, కార్యాచరణ ఎస్.ఓ.పి–2025’ కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. బాల్య వివాహాల కలిగే అనర్థాలను వివరించారు.బాల్య వివాహం చేసిన, ప్రోత్సహించిన, సహకరించిన వారికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.లక్ష జరీమానా ఉంటుందన్నారు. శిశు సంక్షేమ కమిటీ కొరాపుట్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ బి.గాయిత్రీదేవి, జిల్లా శిశు సంక్షేమ అధికారి సంగీతా రాణిపాణి, లీగల్ ఎయిడ్ ప్రధాన డిఫెన్స్ కౌన్సిల్ ప్రమోద్ కుమార్ దాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ హరిశ్చంద్ర ముదులి, పోలీసు సహాయ సూపరింటెండెంట్ డాక్టర్ హృషికేష్ బెహరా, జాయింట్ లేబర్ కమిషనర్ రామేశ్వరి హికాక తదితరులు బాల్య వివాహాల చట్టాలను వివరించారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.


