ఆటో బోల్తాపడి పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: తలగాం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఆటో బోల్తాపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌపడ ఆర్ఎస్ నుంచి కొంతమంది ప్రయాణికులతో కలిసి ఆటోలో టెక్కలి వైపు వస్తుండగా తలగాం జంక్షన్ వద్ద దామోదరపురం రహదారి మీదుగా ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా టెక్కలి రోడ్డు పైకి వచ్చారు. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ద్విచక్ర వాహనచోదకులు సైతం అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నౌపడకు చెందిన బి.జయరాం, వి.కళ్యాణి, కె.అప్పారావు, భావనపాడుకు చెందిన ఎన్.రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న యరకన్నపేటకు చెందిన సీహెచ్ గవిరీష్, ఐ.లచ్చోడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


