ఎల్‌బీఎస్‌నగర్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎల్‌బీఎస్‌నగర్‌లో చోరీ

Feb 24 2026 7:48 AM | Updated on Feb 24 2026 7:48 AM

ఎల్‌బీఎస్‌నగర్‌లో చోరీ

ఎల్‌బీఎస్‌నగర్‌లో చోరీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో ఇద్దరు మైనర్లు చోరీకి పాల్పడ్డారు. నగరంలోని ఓ ప్రైవేటు స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు ఓ ప్రభుత్వోద్యోగి ఇంట్లో చొరబడ్డారు. రెండు తులాల బంగారం, రూ.4 వేలు నగదు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలురు తల్లిదండ్రులు ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడుని కలిసి అభ్యర్థించడంతో ఇరువురు బాలురిని వేర్వేరుగా కౌన్సిలింగ్‌ నిర్వహిహించి పంపివేశారు. అనంతరం చోరీ సొత్తును బాధితులకు అప్పగించారు.

ఖైదీలు సత్ప్రవర్తనతతో మెలగాలి

గార: జైలులో సత్ప్రవర్తనతతో మెలగాలని, శిక్షాకాలం ముగిసిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. సోమవారం అంపోలు జిల్లా జైలును తనిఖీ చేసిన అనంతరం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. ఖైదీల కేసుల పురోగతిని సమీక్షించారు. ఆరోగ్యం పరిస్థితులపై ఆరా తీసి, వంటశాలను తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో జైలర్‌ దివాకర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

పాతపట్నం: మండలంలోని ఎ.ఎస్‌.కవిటి గ్రామానికి చెందిన అంపోలు నాగవేణి గడ్డిమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త అంపోలు తిరుపతిరావు పొలానికి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో గడ్డిమందు తాగి తన సోదరికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. వెంటనే ఆమె స్థానికులకు తెలియజేయడంతో ఆటోలో పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. భర్త తిరుపతిరావుతో కుటుంబ తగాదాలే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.

25న శ్రీకాకుళంలో జాబ్‌మేళా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పథక సంచాలకుడు పి.కిరణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీ–మార్ట్‌(హైదరాబాద్‌), ఫ్యూషన్‌ ఫైనాన్స్‌(శ్రీకాకుళం)లో అసోసియేట్‌, క్యాషియర్‌, పర్చేజ్‌ ఆఫీసర్‌, రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 10వ తరగతి ఆపై అర్హత కలిగి, 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.16,000 నుంచి రూ.26,000 వరకు వేతనం లభిస్తుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రేషన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, బయోడేటాతో బుధవారం ఉదయం 9:30 గంటలకు శ్రీకాకుళంలోని నెహ్రూ యువ కేంద్రం వద్దకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 7989744612 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలి

శ్రీకాకుళం అర్బన్‌: అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాలని సీఐటీయూ టౌన్‌ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుజరాతీపేటలో ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ సిబ్బంది సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, పెన్షన్‌ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లల్లో ధరలు విపరీతంగా పెరిగినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు సరిపోవన్నారు. 164 సూపర్‌వైజర్‌ పోస్టులు వెంటనే భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. మే నెలంతా వేసవి సెలవులు ఇచ్చేలా జీఓ విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిల్లో రిలే నిరాహార దీక్షలు, మార్చి 2న విజయవాడలో అలంకార్‌ సెంటర్‌ వద్ద మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీక్షలకు సీఐటీయూ టౌన్‌ కో– కన్వీనర్‌ ఎం.గోవర్దనరావు, సీనియర్‌ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.జ్యోతి, కె.సంధ్య, వై.లీలారత్నకుమారి, కె.పార్వతి, ఎల్‌.శ్యామల, టి.పుష్పలత, ఇ.అప్పలనర్సమ్మ, ఎల్‌.రూపవతి, బి.లక్ష్మి, ఎం.వరలక్ష్మి, వి.సంతోషి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement