భువనేశ్వర్: పవిత్ర శ్రీ క్షేత్రం విరజిమ్ముకున్న రంగులతో శోభాయమానంగా కళకళలాడింది. శ్రీ జగన్నాథుడు హోలీ సందర్భంగా రంగుల జాతర డోలోత్సవం ఆచారంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జరిగే ప్రముఖ యాత్రల్లో డోలోత్సవం ఒకటి కావడం విశేషం. ప్రత్యేక డోలికలో ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ప్రతినిధిగా శ్రీ దేవి, భూ దేవి సమేతంగా ప్రత్యేక ఆచార నియమాలతో పూజలందుకున్నాడు. అనంతరం ఊరేగింపుగా శ్రీ మందిరం నుంచి డోలిక మండపానికి తరలివెళ్లాడు. నయనానందంగా సాగిన ఈ ఊరేగింపు ప్రత్యక్షంగా తిలకించిన భక్తజన హృదయాలు పులకించి పోయాయి. డోలిక మండపంలో ప్రత్యేక భోగాదుల నివేదనతో పూజా కార్యక్రమం ముగియడంతో ఆ ప్రాంగణం రంగులమయమైంది.
అర్ధరాత్రి అలంకరణ
ఈ ఏడాది చంద్ర గ్రహణం కారణంగా స్వర్ణ అలంకరణ పగటిపూట కాకుండా మంగళ వారం అర్ధ రాత్రి నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఈ సన్నాహాలు ప్రారంభించారు. మంగళ హారతి తదితర దైనందిన సేవాదులు క్రమ పద్ధతిలో ముగించి స్వర్ణ అలంకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవుళ్ళకు ఖొయికొర భోగాన్ని సమర్పించారు. 7 రోజుల డోలోత్సవం చైత్ర మాసం (శ్రీ మందిరం పంచాంగం గణాంకాల ప్రకారం) మొదటి రోజున డోల పూర్ణిమతో ముగిసింది.
యాత్రికుల నడుమ డోలోత్సవం ఊరేగింపు
స్వర్ణ అలంకారం
పవిత్ర డోలో పూర్ణిమ సందర్భంగా శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాట్లకు బంగారు ఆభరణాలతో రాజాధి రాజా అలంకరణ ఆచారం నిరవధికంగా కొనసాగుతుంది. ఏటా 5 సార్లు జరిగే స్వర్ణ అలంకారాల్లో ఇదొకటి కావడం విశేషం. ఇది భక్తులకు ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయ దృశ్యం. ఈ దర్శనం దైవిక ఆశీస్సులతో శ్రేయస్సు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.


