రాయగడ: జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో 71 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో 55 వ్యక్తిగత సమస్యకాగా తొమ్మిది గ్రామ సమస్యలుగా అధికారులు గుర్తించారు. మరో ముగ్గురు ఆరోగ్య సమస్యలకు సంబంఽధించి విన్నవించుకున్నారు. వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 వేల రూపాయలను కలెక్టర్ మంజూరు చేయగా మరో నలుగురుకి రెడ్క్రాస్ నిధుల నుంచి 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, డీఎఫ్వో సచిన్ అన్నాసాహెబ్ ఆహోలే, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా ముఖ్యవైధ్యాధికారి డాక్టర్ సరోజినిదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
మల్కన్గిరిలో 34 వినతులు..
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎఫ్ఎల్సీ హాల్లో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ గ్రీవెన్స్సెల్ను నిర్వహించారు . ఈ సందర్భంగా 34 వినతులు స్వీకరించారు. వీటిలో 26 వ్యక్తిగతం కాగా ఎనిమిది గ్రామ సమస్యలకు సంబంధించిన వినతులు ఉన్నాయి. కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. తీసుకున్న చర్యలు వివరాలు తనకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరధి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర జిల్లాస్థాయి అధికారులు, సమితి అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
విన్నపాలు విన్నారు
పర్లాకిమిడి: జిల్లాకలెక్టర్ కార్యాలయం మీటింగు హాలు 2 లో సోమవారం జాయింట్ గ్రీవెన్సు సెల్, స్పందన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రజాసమస్యలు వినడానికి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీఓ అంశుమాన్ మహాపాత్రో తదితరులు విచ్చేశారు. రాణిపేట, పర్లాకిమిడి పురపాలకసంఘం, కత్తల కవిటి పంచాయితీల నుంచి మొత్తంగా 96 వినతులు, అభియోగాలు అందగా వాటిలో గ్రామ సమస్యలు 14, వ్యక్తిగత సమస్యలు 82 ఉన్నాయి. కొన్ని అభియోగాలను సంబంధిత శాఖలకు వెంటనే పంపించారు. గుసాని సమితి గారబంద పీహెచ్సీలో డాక్టరుగానీ, ఫార్మసిస్టు, ఇతర సిబ్బంది లేని కారణంగా రంప, లాబణ్యగడ గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రంప మాజీ సర్పంచు, ఆదివాసీ మహాసంఘ్ అధ్యక్షులు నిరోభుయ్యాన్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. వెంటనే ఏడీఎం ఆయన అభియోగాన్ని సీడీఎంఓకు పంపించారు. కొందరికి మధుబాబు వృద్ధాప్య పింఛన్కార్డులను అధికారులు అందజేశారు. నేటి గ్రీవెన్స్కు గుసాని సమితి బీడీఓ గౌరచంద్ర పట్నాయిక్, తాహాసిల్దారు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.


