మందస: మండలంలోని రట్టి గ్రామంలో వల్లభనారాయణ స్వామి డోలోత్సవ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోంపేట పట్టణంలోని గాంధీ నగర్కి చెందిన యువకుడు ఆర్థి వాసుదేవ్ తన స్నేహితులతో కలిసి సోమవారం సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న బారువ మైరెన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించి, ప్రథమ చికిత్స అందించి.. 108 వాహనంలో హరిపురం పీహెచ్సీకి తరలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బారువ మైరెన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ సంఘమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోమ్ గార్డ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్తో గుర్తు తెలియని యువకుడు మృతి
టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద సోమవారం గుర్తు తెలియని యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహరీ లోపలి భాగంలో గోడ కంటే ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్ను గోడపైకి ఎక్కి పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదని, సుమారు 38 ఏళ్లు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.


