ఆదిత్యాలయం..భక్తజన సందోహం
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. మాఘ మాసంతో పాటు వత్సవలస రాజమ్మ తల్లి ఉత్సవాల నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచే ప్రధాన రహదారిలో భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ సూపరింటెండెంట్ వెంకటరమణ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టగా.. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అంతరాలయంలో గోత్రనామాలతో పూజలు చేశారు. నగర కార్పొరేషన్కు కమిషనర్ బాధ్యతలు చేపట్టిన బొడ్డేపల్లి రాము కుటుంబసమేతంగా ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ఓం ఫ్రీ యోగా సంస్థ ప్రతినిధి, యోగా గురువు చిలకా వెంకటరమేష్, ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ బి.ఎస్.రాంబాబు, ఏపీ, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టి.రవీంద్రనాథ్, డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వి.ఉదయకుమార్, జిల్లా బ్యాంకు ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ బి.శ్రీనివాసులు, సంఘ సభ్యుడు పెదపెంకి ఉపేంద్ర తదితరులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు.


