మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
జయపురం: జయపురం సమితి గ్రామ ప్రాంతాల్లో పర్యావరణం, విద్య, వైద్యం, తాగునీటి వనరుల కల్పన, అడవుల పెంపకంతో పాటు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక జయపురం పంచాయతీ సమితి కార్యాలయంలో జయపురం సమితి 7వ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి కార్యాలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన సమితి సభాగృహాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముందుగా సంప్రదాయంగా పూజ చేసిన అనంతరం సమితి బిడిఒ శక్తి మహపాత్రో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జయపురం సమితిని రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిపేందుకు సమితిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలన్నారు. అందుకు తగిన ఆర్థిక సహాయం అందేలా తాను రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీడీఓ శక్తి మహపాత్రో మాట్లాడుతూ జయపురం సమితి పరిధిలో పనసపుట్బగర గ్రామంలో ఉన్న దక్షిణ కాళీదేవాలయ ప్రాంతాన్ని రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ సమావేశంలో పంచాయతీ సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, ఉపాధ్యక్షుడు గణేష్ పాడీ, ఎంపీ ప్రతినిధి కృష్ణచంద్ర నేపక్, జిల్లా పరిషత్ సభ్యులు తిపతి పట్నాయక్, అస్తా నాయక్, రశ్మీరత్, వ్యవసాయం, ఉద్యానవనం, అటవి, విద్యుత్, పశుసంపద, విద్య గ్రామీణ అభివృద్ధి, మైనర్ ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమ విభాగం, మట్టి సంరక్షణ, ఎస్.టి, ఎస్.సి. సంక్షేమం, సామాజిక భద్రత, పౌర సరఫరా విభాగం, తాగు నీరు, తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సమితి ఇంజినీర్ విజయ్కుమార్ నందా, జూనియర్ ఇంజినీర్ భవానీశంకర్ పాత్రో పర్యవేక్షించారు.


