భువనేశ్వర్:
రైలు టికెటు తనిఖీ ఉద్యోగ నిర్వహణలో బహుముఖ అవగాహనతో వ్యవహరించాలని విరామం పొందిన సిబ్బంది తోటి సిబ్బందిని ప్రబోధించారు. రైల్వే నిబంధనల ప్రకారం పలు వర్గాల ప్రయాణికుల సుఖమయమైన ప్రయాణంలో టికెట్ తనిఖీ సిబ్బంది పాత్ర కీలకంగా పేర్కొన్నారు. విధుల నిర్వహణతో సిబ్బంది సంక్షేమం కోసం ముందంజలో నిలిచిన ప్రభాకర్ బొరాల్తో మరో ఇద్దరు ప్రధాన టికెటు తనిఖీ అధికారులు (సీటీఐ) రమేష్ ప్రధాన్, ఎస్సీ హంసదా రైల్వే సేవల నుంచి విరామం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు అధికారులు, కార్మిక ప్రముఖులు పాల్గొన్నారు. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు శాఖా కార్యదర్శి లక్ష్మీధర మహంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది పాలుపంచుకున్నారు. ఉద్యోగం నుంచి విరామం పొందిన సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమిస్తానని ప్రభాకర్ బొరాల్ అన్నారు.


