కొరాపుట్: అంబులెన్స్ రాలేకపోవడంతో బాలింతని డోలీ మీద తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి మైదల్పూర్ గ్రామ పంచాయతీ కుసుంకుంట గ్రామంలో కుసుం బొత్ర అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడింది. దీంతో గ్రామస్తులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్ రాలేక పోయింది. అంతలో గర్భిణి ప్రసవం జరిగి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గ్రామస్తులు డోలీ మీద కిలో మీటర్ దూరం మోసుకుని వెళ్లారు. అక్కడ నుండి ఒక ఆటో లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదల్పూర్ ఆస్పత్రికి తరలించారు.
200 తాబేళ్ల స్వాధీనం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 అటవీ శాఖ వారు సోమవారం మధ్యాహ్న సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వాహనంలో తరలిస్తున్న తాబేళ్లను గుర్తించి పట్టుకున్నారు. అటవీ శాఖ వారిని చూసి మాఫియా వారు పరారయ్యారు. అటవీ శాఖ వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంవీ 62 గ్రామానికి ఈ తాబేళ్లను తీసుకువస్తున్నట్లు సమాచారం. వీటి విలువ రూ.4లక్షలకు పైగా ఉంటుందని అటవీ శాఖాధికారులు తెలిపారు.
బాలికలకు ఈత శిక్షణ శిబిరం ప్రారంభం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలో తొలిసారి బాలికలకు ఈత శిక్షణ శిబిరం ప్రారంభించారు. రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం మల్కన్గిరిలో కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ జిల్లా పంచాయతీ సాధన కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా నీటిలో మునిగే ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇది 7వ విడత శిక్షణ శిబిరం ఇందులో 30 పాల్గొంటారు. ఓడ్రాఫ్ బృందం శిక్షణ ఇస్తుంది. మంగళవారం నుంచి స్థానిక బండా బాకులి చెరువు వద్ద ప్రాక్టికల్ ఈత శిక్షణ ఇస్తారు.
ధాన్యం కొనుగోలు చేయాలని వినతి
పర్లాకిమిడి: ఖరీఫ్ ధాన్యం ఇంకా తమవద్దే ఉన్నాయని.. వీటిని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు గుసాని సమితి ఉప్పలాడ, కొర్సండ, బుసుకిడి తదితర పంచాయతీల రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం చేరుకుని సబ్ కలెక్టర్, ఇన్చార్జి సివిల్ సప్లై అధికారి అనుప్పండాకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లకు విడుదల చేసిన టోకెన్లు మరో రెండు రోజుల్లో గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ధాన్యం ఎప్పుడు మండీల వద్ద కొనుగోలు చేస్తారో చెప్పాలని రైతులు అధికారులను అడిగారు. రైతుల వద్ద కొంత ధాన్యం కొనుగోలు చేసి మరికొంత మిగిలిపోయిందని రైతులు విన్నవించారు. వివిధ సొసైటీలలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రానందున ధాన్యం కొనుగోళ్లకు జాప్యం జరుగుతున్నట్టు సబ్ కలెక్టర్ అనుప్పండా, ఏఆర్సీఎస్ హారిహార శెఠికి వినతులు అందజేశారు.


