రచయిత నాగరాజుకు సన్మానం
రాయగడ: పట్టణానికి చెందిన ప్రముఖ కవి, రచయిత భళ్లమూడి నాగరాజును తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవితల పోటీల విజేతలకు సత్కరించిన సందర్భంగా ఆయనకు ఈ అవకాశం లభించింది. జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని నిర్వాహకులు అందించారు. ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అక్షరాల తోవ సాహితీ సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం జరిగింది. సంస్థ నిర్వాహకులు, ప్రముఖ రచయితలు నామా పురుషోత్తం, దాసరాజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త మువ్వా శ్రీనివాస్, ప్రముఖ బాల సాహితీ వేత్త ఉరిమెళ్ల సునంద, ప్రముఖ కవయిత్రి,సైకాలజీస్ట్ తాళ్లూరి లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగరాజు సతీమణి శేషసాయి అద్భుతమైన పాటలు పాడి ప్రశంసలు అందుకున్నారు. నాగరాజు రచించిన 40 కథలు, 138 కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గతంలో సాహితీ రత్న, సాహితీ శిరోమణి వంటి బిరుదులు పొందారు. ఈ సందర్భంగా స్థానిక సాహితీ సంస్థల ప్రతినిధులు నాగరాజు దంపతులను అభినందించారు.


