‘దేవుడనే వాడున్నాడా ‘అని వితండవాద నాస్తికవాదులకు ఎదురుగా అగుపడే వ్యక్తి దేవుడే అయితే అంత కన్నా సరి అయిన ఋజువు, సమర్థన మరేం కావాలి? కథల్లో, పురాణాల్లో భగవంతుడు వచ్చాడని, రక్షించాడని విన్నాం, నమ్మాం.. నిజంగా నిలబడి నడిచొస్తూ నాస్తికత్వాన్ని ఖండించి అద్వైత తత్త్వాన్ని సుస్థిరం చేసి అద్వైత వాదిగా అరుదెంచి హిందూమతాన్ని రక్షించి జాతిని నడిపించే దేవుడే శంకర భగవత్పాదులు.. పరమాచార్య శంకరాచార్యులు...
శివుడే శంకరులుగా...
హిందూమతం క్షీణదశలో ఉన్నప్పుడు ఆ మత పరిరక్షణకై పుణ్యదంపతులు శివగురు, ఆర్యాంబలు చేసిన తపః ఫలంగా కాలాడి అగ్రహారంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరులుగా జన్మించాడు.. ఆవేళ ప్రకృతి పరవశించింది. ప్రపంచంలో పరమశాంతి పరిమళించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఆ బాలుడిలో చంద్రవంక, మూడవ నేత్రం, శూలం ఉన్నాయి. తెల్లని కాంతి.. లక్షణాల్లో సూర్యుడు.. మేరు పర్వతం.. సరస్వతీదేవి పోలిక.. ఈశ్వర వర ప్రసాదుడు. తోటి బాలురు తప్పటడుగులు వేస్తుంటే శంకరాచార్యులు సర్వ భాషలందు ప్రావీణ్యం, ప్రజ్ఞ సాధించి అసాధారణ బుద్ధితో వేద, వేదాంగాల్లో బ్రహ్మని, బృహస్పతిని మించి΄ోయాడు. శివ రహస్యంలోనూ, కూర్మ పురాణం లోనూ ఈ అవతార ప్రస్తావన ఉంది.
అద్వైత తత్వ స్థాపన –జైత్రయాత్ర
శంకరాచార్యుల తన ప్రజ్ఞాపాటవాలతో, వాగ్ధాటితో నాస్తిక మతాన్ని మట్టుపెట్టటానికి విద్వాంసులతో వాద ప్రతి వాదనలకు దిగి అందరినీ ఓడించారు. ఒకసారి వేయిమంది పండితులను అవలీలగా జయించారు. విష్ణు సముడైన వ్యాసభగవానుడినే తన వాదనతో మెప్పించారు. దేశంలో నలు మూలల్లో పీఠాలు స్థాపించి సనాతన మత పునరుద్ధరణలో భాగంగా తత్వ, వేదాంత పూజాది నియమాలు, సంప్రదాయాలు నెలకొల్పి జ్ఞాన జ్యోతులను వెలిగించారు.
ఎన్నెన్నో రచనలు – నిత్య సాధనలు
బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గిత, విష్ణు సహస్ర నామం, గాయత్రి మంత్రానికి భాష్యాలు రచించారు. వీటివల్ల మనకి దైవ సన్నిధి, పెన్నిధి ఏర్పడ్డాయి. పలు ప్రకరణ గ్రంథాలు రచించారు. మనం రోజు చదివే స్తోత్రాలలో ఎక్కువ వారు రాసినవే. వివేక చూడామణి, నిర్గుణ మానస పూజ, శివానంద లహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, కనకధార స్తోత్రం.. ఇలా ఎన్నెన్నో. తాను నడుస్తూ మన అందరిని మంచి ద్రోవలో నడిపిస్తున్న ఆ దేవుడికి జేజేలు.
ఇదీ చదవండి: Ramanuja Jayanthi 2026 ఈ ఆసక్తికకర విషయాలు తెలుసా?
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి


