లాహార్: పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో కలకలం చెలచేరింది. కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అమీర్ హంజాపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ కార్యాలయం వెలుపల ఈ అనూహ్య దాడి జరిగింది. తీవ్ర గాయాలపాలైన హంజా ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం లాహోర్లోని ఒక న్యూస్ ఛానెల్ ఆఫీస్ ముందు అమీర్ హంజా ఉన్న సమయంలో ముసుగు ధరించిన దుండగులు ఒక్కసారిగా తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఆకస్మిక కాల్పుల దాడిలో బుల్లెట్లు తగలడంతో హంజా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. కరుడుగట్టిన ఉగ్రవాది హాఫిజ్ సయీద్తో కలిసి లష్కరే తోయిబాను స్థాపించిన హంజా.. భారతదేశంలో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో కీలక సూత్రధారి.
అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
అమీర్ హంజా.. తన విద్వేషపూరిత ప్రసంగాలు, రచనలతో ఎంతోమంది యువతను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. లష్కరే అధికారిక పత్రిక ‘మజల్లా అల్-దావా’కు ఫౌండింగ్ ఎడిటర్గా పనిచేయడమే కాకుండా 2002లో ‘కాఫిలా దావత్ ఔర్ షహాదత్’ వంటి తీవ్రవాద పుస్తకాలను రచించాడు. అతడి ప్రమాదకర కార్యకలాపాలను గుర్తించిన అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్.. లష్కరేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు, హంజాను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా పేర్కొంది. లష్కరే సెంట్రల్ కమిటీలో ఉంటూ ఉగ్రవాదుల నిధుల సమీకరణ, రిక్రూట్మెంట్లో ఇతడు కీలక పాత్ర పోషించాడు.
ఇది కూడా చదవండి: New York: కుబేరులకు మేయర్ మమ్దానీ షాక్


