ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన | Why Pakistans Hussaini Suspension Bridge is the Deadliest in the World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెన

Jun 13 2026 7:37 AM | Updated on Jun 13 2026 10:38 AM

Why Pakistans Hussaini Suspension Bridge is the Deadliest in the World

ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన, ఆధునిక వంతెనలు ఉన్నాయి. కానీ కేవలం  ఇనుప తీగలు, సరిగ్గా అమర్చని చెక్క పలకలతో నిర్మించిన ఒక వంతెనను చూస్తే మాత్రం ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. పాకిస్తాన్‌లోని ఉత్తర పర్వత ప్రాంతంలో ఉన్న ‘హుస్సేనీ సస్పెన్షన్ బ్రిడ్జ్’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంతెనగా గుర్తింపు పొందింది. గిల్గిట్-బాల్టిస్తాన్ రీజియన్‌లో ఉధృతంగా ప్రవహించే హుంజా నదిపై నిర్మించిన ఈ వంతెన పర్యాటకులకు వింత అనుభూతిని ఇస్తూనే, ప్రతి అడుగులోనూ మృత్యువును పరిచయం చేస్తుంది. అసలు ఈ వంతెన అంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.

భీకర గాలులను తట్టుకునే ప్రత్యేక వింత డిజైన్
ఈ వంతెనను చూడగానే ఎవరికైనా భయం వేయడం సహజం. వంతెనపై ఉన్న చెక్క పలకల మధ్య చాలా ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది. అయితే, ఇది పాలకుల నిర్లక్ష్యం కాదు. ఇదొక వ్యూహాత్మక ఇంజనీరింగ్ డిజైన్. గోజల్ లోయలో వీచే అత్యంత వేగవంతమైన, భీకర గాలులు వంతెనను పడగొట్టకుండా ఉండటానికే ఈ ఖాళీలను ఉంచారు. ఒకవేళ ఈ చెక్కలను దగ్గర దగ్గరగా అమరిస్తే, బలమైన గాలులను తట్టుకోలేక మధ్యలోకి విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఖాళీల గుండా గాలులు అడ్డులేకుండా సాగిపోతాయి. అయితే ఈ ఖాళీలపై అడుగు వేస్తూ కింద ఉన్న నీటిని చూస్తూ నడవడం పర్యాటకులకు ఒక అగ్నిపరీక్షే.

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలిచిన వంతెన
హుస్సేనీ వంతెనకు భారీ విధ్వంసం, పునర్నిర్మాణాల చరిత్ర ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న వంతెన అసలైనది కాదు. గతంలో ఇక్కడ నిర్మించిన వంతెనలు ఈ ప్రాంతంలో వచ్చే తీవ్రమైన వాతావరణ మార్పులు, రుతుపవనాల వరదలు, నదీ ప్రవాహాల ఉధృతికి కొట్టుకుపోయాయి. ప్రకృతి ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి ఒక ఉదాహరణ.. ప్రస్తుత వంతెన పక్కనే పాత వంతెనకు సంబంధించిన తుప్పు పట్టిన, విరిగిపోయిన ఇనుప కేబుళ్లు ఇప్పటికీ వేలాడుతూ కనిపిస్తాయి. స్థానికులు నిరంతరం ఈ వంతెనను పర్యవేక్షిస్తూ, విరిగిపోయిన చెక్కల స్థానంలో కొత్తవాటిని మారుస్తూ పునరుద్ధరిస్తుంటారు.

సాహసికులకు స్వర్గధామం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస ప్రియులకు ఈ వంతెన ఒక స్వర్గధామం. తమ ధైర్యాన్ని పరీక్షించుకోవడానికి ప్రతి ఏటా వందలాది మంది అంతర్జాతీయ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వంతెనపై నడుస్తున్నప్పుడు వచ్చే బలమైన గాలులకు అది ఇరువైపులా ఊగులాడుతూ ఉంటే గుండె ఆగినంత పనవుతుంది. ఎటువంటి ఆధునిక రక్షణ ఏర్పాట్లు, పటిష్టమైన  రైలింగ్‌లు లేని ఈ వంతెనపై ప్రయాణం ఒక అద్భుతమైన, అత్యంత ప్రమాదకరమైన ప్రయాణ అనుభూతిని మిగుల్చుతుంది.

స్థానికుల జీవననాడి..
అంతర్జాతీయ పర్యాటకులకు ఇది కేవలం ఒక సాహస వినోదం మాత్రమే కావచ్చు. కానీ స్థానికులకు మాత్రం ఇది నిత్య జీవితంలో ఒక భాగం. హుస్సేనీ గ్రామాన్ని, నది అవతల ఉన్న జరాబాద్ వ్యవసాయ భూములతో అనుసంధానించే ఏకైక మార్గం ఇదే. స్థానికులు ప్రతిరోజూ భారీ బరువులను, నిత్యావసర సరుకులను నెత్తిన పెట్టుకుని ఈ  ఊగిసలాడే చెక్కలపై ఎంతో సునాయాసంగా నడుచుకుంటూ వెళ్తుంటారు. వారి దైనందిన జీవన గమనానికి ఈ వంతెనే ఏకైక ఆధారం.

నిర్వహణ ఖర్చులు.. పర్యాటక రుసుము
ఈ ప్రమాదకరమైన వంతెనను సజీవంగా ఉంచడానికి స్థానికులు ఎంతో పాటుపడుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల నుంచి సుమారు 200 రూపాయల (స్థానిక కరెన్సీ) నిర్వహణ రుసుమును వసూలు చేస్తారు. ఈ నిధులన్నింటినీ నేరుగా స్థానిక కమ్యూనిటీ నిధికి బదిలీ చేస్తారు. అత్యంత కఠినమైన శీతాకాలం ప్రారంభం కావడానికి ముందే వంతెనకు అవసరమైన కొత్త చెక్కలను కొనుగోలు చేయడానికి, ఇనుప తీగలను మరమ్మతు చేయడానికి ఈ డబ్బును వినియోగిస్తారు.

ఇది కూడా చదవండి: ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement