సాక్షి, న్యూఢిల్లీ: జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు మితిమీరిన బలప్రయోగానికి దిగారనే ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. లాఠీ చార్జి ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సి కీలక వ్యాఖ్యలు చేసింది.
జూలై 25న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, ఎన్హెచ్ఆర్సి ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నోటీసులు పంపుతూ, దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రజా నిరసనల సమయంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణపై ఈ ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, కమిషన్ సుమోటోగా స్వీకరిస్తోందని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది.
శాంతియుత నిరసన ప్రాథమిక హక్కు, శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని సహేతుక పరిమితులు మాత్రమే విధించాలి కానీ, నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగం కూడదని కమిషన్ వ్యాఖ్యానించింది. లాఠీచార్జి అనంతరం వారికి అందించిన వైద్య సహాయం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈఘటనపై సీసీటీవీ ఫుటేజ్ రికార్డు అందజేయాలని కూడా ఆదేశించింది. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల ప్రకారం భారత్ పాటించాల్సిన బాధ్యతలకు విరుద్ధం" అని ఆర్డర్లో పేర్కొంది. జులై 20వ తేదీన జరిగిన ఘటనపై రెండు వారాల్లో సవివర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులిచ్చింది.
ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్కు హ్యాట్సాఫ్
నిరసనకారులకు అయిన గాయాల వివరాలతోపాటు, గాయపడిన విద్యార్థులకు వైద్య సహాయం అందిందో లేదో తెలిపే సమాచారం. నిరసన సమయంలో గుంపును అదుపు చేయడానికి అనుసరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలు, ఇంకా ఉపయోగించిన బలప్రయోగం సమర్థనీయమైనదా మరియు పరిమితులకు లోబడి ఉందా అనినిర్ధారించడానికి ఏమైనా విచారణ ప్రారంభించారా అనే వివరాలు కూడా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
కాగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలపై అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీఇచ్చిన పిలుపుతో జూన్ నెలలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జూలై 20న పార్లమెంట్కు "సంసద్ చలో" పిలుపు తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీనికి ఎలాంటి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ , ఇతర బలప్రయోగ చర్యలకు దిగారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గామారడంతో కమిషన్ స్పందించింది.
ఇదీ చదవండి: రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!


