ప్రధానికి మాజీ ఐఏఎస్‌ వింత విజ్ఞప్తి | Resignation Pending for 7 Years Former IAS Officer Urges PM Modi to Accept It | Sakshi
Sakshi News home page

ప్రధానికి మాజీ ఐఏఎస్‌ వింత విజ్ఞప్తి

Jul 28 2026 12:48 PM | Updated on Jul 28 2026 1:26 PM

Resignation Pending for 7 Years Former IAS Officer Urges PM Modi to Accept It

న్యూఢిల్లీ: ప్రభుత్వ సేవలో తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచలేకపోతున్నానంటూ ఏడేళ్ల క్రితం రాజీనామా సమర్పించిన మాజీ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపినాథన్ దానిని వెంటనే ఆమోదించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరోసారి కోరారు. ‘ఎక్స్’ వేదికగా ప్రధానిని ట్యాగ్ చేస్తూ ఆయన ఈ అభ్యర్థన చేశారు. ‘ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. మీరు ఇప్పుడు రాజీనామాలు ఆమోదించడం ప్రారంభించారు కాబట్టి, దయచేసి నా రాజీనామాను కూడా ఆమోదించండి. దీనికి ఇప్పటికే ఏడేళ్లు పూర్తయ్యాయి’ అని ఆయన పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 2012 బ్యాచ్‌కు చెందిన ఏజీఎండీయూటీ కేడర్ ఐఏఎస్ అధికారి గోపినాథన్ 2019లో తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇన్నేళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఆయన రాజీనామాను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో ఆయన.. తనకు గత ఏడేళ్లుగా ఎలాంటి జీతం అందలేదని, సస్పెన్షన్‌కు గురికాలేదని, కేవలం తన ఫైల్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తొక్కిపెట్టిందని విమర్శించారు.

గతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తనకు నోటీసులు జారీ చేస్తూ.. సర్వీస్‌లో ఉండగానే ప్రభుత్వాన్ని విమర్శించినందున మీ పే-స్కేల్ తగ్గిస్తామని తెలిపిందని, కానీ తనకు ఎటువంటి జీతం అందనప్పుడు పే-స్కేల్ కోత ఎలా వర్తిస్తుందని ఆయన గతంలో ప్రశ్నించారు. ఇదే సమయంలో రాజీనామా చేసిన పలువురు అధికారుల రాజీనామాలు ఇప్పటికే ఆమోదం పొందగా, తన ఫైల్ మాత్రం హోంశాఖ వద్దే పెండింగ్‌లో ఉండటం గమనార్హంమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement