లోకేశ్‌.. మీరు రాజీనామా చేయరా? | Unemployed youth Demands AP Education Minister Nara Lokesh Resignation Over AP DSC Controversy: AP | Sakshi
Sakshi News home page

లోకేశ్‌.. మీరు రాజీనామా చేయరా?

Jul 27 2026 4:52 AM | Updated on Jul 27 2026 4:55 AM

Unemployed youth Demands AP Education Minister Nara Lokesh Resignation Over AP DSC Controversy: AP

డీఎస్సీ స్కామ్‌కు మీరు బాధ్యత వహించాల్సిందే 

సూటిగా నిలదీస్తున్న నిరుద్యోగ యువత

నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌పై బాధ్యత వహించిన కేంద్రం

సీబీఐ విచారణ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా 

సాక్ష్యాధారాలతో ఏపీ డీఎస్సీ స్కామ్‌ రుజువైనా నైతిక బాధ్యత 

వహించని చంద్రబాబు సర్కార్‌.. స్పోర్ట్స్‌ కోటా టీచర్‌ పోస్టుల 

బేరసారాల వీడియోలు బట్టబయలైనా నిష్పక్షపాత విచారణ ఏదీ? 

పతకాలు సాధించిన వారికి కాకుండా కేవలం పాల్గొన్న వారికి ఉద్యోగాలు 

డీఎస్సీ–2025 కుంభకోణంలో ఆది నుంచి ఎదురుదాడి 

నైతికత, జవాబుదారీతనం, బాధ్యత మచ్చుకైనా కనిపించని వైనం  

ప్రధాన్‌ తరహాలో మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందేనని ఏపీజెన్‌జీ కన్నెర్ర  

సాక్షి, అమరావతి: నీట్‌ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్‌ అయిందని తేలిన వెంటనే మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిందితులను కటకటాలపాలు చేసింది. లీక్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బాధ్యత వహించాలని జెన్‌ జీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో కేంద్రం దిగొచ్చింది. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధాన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించింది. నీట్‌ పేపర్‌ లీకేజీని తలదన్నే రీతిలో రాష్ట్రంలో సాగిన డీఎస్సీ–2025 కుంభకోణం పక్కా సాక్ష్యాధారాలతో రుజువైనా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసింది.

డీఎస్సీ ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి నియామకాల వరకు జరిగిన గోల్‌మాల్‌పై ఆధారాలు కళ్లెదుటే కనిపిస్తున్నా, బాబు ప్రభుత్వం మాత్రం బాధ్యత వహించక పోవడంపై ఏపీ జెన్‌ జీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నీట్‌ తరహాలోనే డీఎస్సీ స్కామ్‌పై చంద్రబాబు ప్రభుత్వం నిష్పక్షపాత విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీస్తోంది. సీబీఐ వంటి థర్డ్‌ పార్టీ దర్యాప్తు సంస్థలతో విచారణ చేస్తే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని నినదిస్తోంది. రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి, నష్టానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తోంది. ప్రధాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే లోకేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏపీ జెన్‌ జీ పట్టుపడుతోంది.  

లీక్‌ను కప్పిపుచ్చే యత్నం 
16 వేల టీచర్‌ పోస్టుల భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ–2025 నిర్వహించింది. ప్రశ్నపత్రం రూపకల్పన నుంచే డీఎస్సీ స్కామ్‌కు బీజం వేసినట్టు జరిగిన తతంగం స్పష్టం చేస్తోంది. ప్రశ్నపత్రం రూపకల్పన, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌ డీఎస్సీ సోషల్‌ స్టడీస్‌ పరీక్షల్లో కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచాడు. టీజీటీ పరీక్షలో జోన్‌–2లో ఆరో ర్యాంక్‌ సాధించాడు. ప్రశ్నపత్రాలు సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడని తెలిస్తే డీఎస్సీ పేపర్‌ లీక్‌ బట్టబయలు అవుతుందని ప్రభుత్వమే లీక్‌ను కప్పిపుచ్చే ప్రయత్నానికి పూనుకుంది.

నీట్‌ పేపర్‌ ఎన్టీఏ ప్యానెల్‌ సభ్యుల నుంచి లీక్‌ అయినట్టే ఏపీ డీఎస్సీ ప్రశ్నపత్రం తయారైన దగ్గరే లీక్‌ అయిందని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎందుకు స్వతంత్ర విచారణ చేపట్టలేదని, లీకైన పేపర్‌ ఎంత మందికి చేరిందో ఎందుకు గుర్తించలేదని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. నవీన్‌ వెనుక ఉన్న పెద్ద తలకాయలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరోవైపు 1ః1 ప్రాతిపదికన సరి్టఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచి, అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రకటించాక కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక మంది ప్రతిభావంతులకు వెన్నుపోటు పొడిచారు. నియామక ఉత్తర్వుల జారీలోను అర్హులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపింది. ఇలా నష్టపోయిన అభ్యర్థులు పక్కా ఆధారాలతో తమకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నారు.  

డీఎస్సీ–2025 ప్రక్రియ ముగియగానే స్పోర్ట్స్‌ కోటాలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఎత్తివేస్తూ ఆయా శాఖలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని జారీచేసిన జీవో నెం.23 

బేరసారాల సాక్ష్యాలు బయటపడ్డా గప్‌చుప్‌ 
స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ అంటూ దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెగా స్కామ్‌ ఏపీలో చోటు చేసుకుందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందే స్కామ్‌ పాలసీలో భాగంగా జీవో 4.. 47 ప్రభుత్వం తెచ్చింది. రాత పరీక్ష, అసలు డిగ్రీనే లేకుండా టీచర్‌ పోస్టులను కట్టబెట్టే దగాకోరు విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు పతకాలతో సత్తా చాటిన వారిని కాదని చంద్రబాబు బంధువు ఎంపీ భరత్, టీడీపీ ఎమ్మెల్యే కూన రవి వంటి వారు చైర్మన్‌లుగా ఉన్న క్రీడా సంఘాలు జారీ చేసిన పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్ల ఆధారంగా తమ వాళ్లకు టీచర్‌ పోస్టులు ఇచ్చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు డిమాండ్‌ చేసిన ఆడియో, వీడియో సాక్ష్యాలు బయటపడ్డాయి. జిల్లా, కాలేజ్, విశ్వవిద్యాలయం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు గెలవకపోయినా, కేవలం పోటీల్లో పాల్గొన్నారనే సరి్టఫికెట్‌లతో టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇలా స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ అంతా స్కామ్‌గా మారినట్లు కళ్లెదుటే సాక్ష్యాలు, నష్టపోయిన అభ్యర్థులు కనిపిస్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టినట్టే నీట్‌ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను నిందితులు అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వాట్సప్‌ గ్రూప్‌లు, డిజిటల్‌ ఆధారాలతోనే సీబీఐ నిందితులను పసిగట్టి జైలుపాలు చేసింది. ఇదే రీతిలో టీచర్‌ పోస్టుల అమ్మకానికి బేరసారాలాడిన వ్యక్తుల ఫోన్‌ నెంబర్, ఆడియో రికార్డింగ్‌తో సహా పక్కా ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై నిష్పపక్షపాత విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం బయట పడుతుందని జీవో 4.. 46 రద్దు చేసి అక్రమాలను ప్రభుత్వమే కప్పి పెట్టేందుకు పూనుకుందని యువత 
విమర్శిస్తున్నారు.  

జీవితాలతో చెలగాటం
వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించింది. ఏపీలో మాత్రం లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కల అయిన డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం వాడుకుంది. డీఎస్సీ స్కామ్‌ గురించి ప్రజల్లో చర్చకు వచి్చనప్పుడల్లా డైవర్షన్‌ రాజకీయం చేస్తోంది. నిరుద్యోగ అభ్యర్థుల సందేహాలు, ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక అవాస్తవాలతో అసలు విషయాన్ని దాటవేస్తోంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి హామీతో గద్దెనెక్కి స్కామ్‌ల డీఎస్సీతో చంద్రబాబు సర్కారు తమ భవిష్యత్‌తో చెలగాటం ఆడిందని నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement