సాక్షి, విజయవాడ: కనకదుర్గమ్మ తల్లి దీవెనలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ రోజు (ఆదివారం) విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ కు బోనం సమర్పించడం17 సంవత్సరాలుగా ఆనవాయితీ వస్తుందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆషాడ మాసం అంటే తెలంగాణలో ఒక పండుగ.. రాష్ట్రంలోని ఆడబిడ్డలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించే పండుగనే ఆషాడమాస బోనాలు. అమ్మవారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ ఏడాది రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అమ్మవారి చల్లని దీవెనలు తెలుగు రాష్ట్రాల పై ఉండాలి... విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.


