సాక్షి, విజయనగరం: నిరుద్యోగుల జీవితాలతో కూటమి ఆటలాడుతోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘జీవోలు ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు’’ అని బొత్స నిలదీశారు.
‘‘డీఎస్సీ పరీక్షల్లో పారదర్శకత లేదు. కేంద్రంలో కూడా నీట్ పరీక్షలు లీక్పై ఇలాంటి కబుర్లు చెప్పారు. అక్కడ ఏమైంది?. విద్యా దీవెన పథకం వైఎస్సార్ తీసుకొచ్చిన పథకం. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు. వైఎస్ జగన్ ఇస్తామంటే ఎన్నికలు వచ్చాయని కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. అందుకే బకాయి ఉంది. అవి ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందా? లేదా?
..స్పోర్ట్స్ కోటాలో నచ్చిన వ్యక్తులకు డీఎస్సీలో నచ్చిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేశారు. నియామకాలు అయిపోయాక ఆ జీవోను రద్దు చేశారు. ఏ ఒక్కరికి అయిన నిరుద్యోగ భృతి ఇచ్చారా?. విద్యార్థులు, నిరుద్యోగులను వేదిస్తున్నారు. నాడు-నేడు స్కూళ్లను కొనసాగించాల్సిన బాధ్యత లేదా?. పిల్లలు చెట్లు కింద చదువు కుంటున్నారు. ఎంత అప్రతిష్ట.. ఒక పక్కన విద్యాదీవెన లేదు, నిరుద్యోగ భృతి లేదు, డీఎస్సీలో అక్రమాలు.. ఇంత దారుణమా?
..భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ఏమైనా ఉద్దారించారా?. విభజన చట్టం ప్రకారం భోగాపురం ఎయిర్ పోర్ట్కి అనుకూలమని కేంద్రం అనుమతులు ఇచ్చారు.. ఎయిర్పోర్ట్కి చంద్రబాబు 15 వేలు ఎకరాలు కావాలని అన్నారు. ఆ తరువాత 5 వేల ఎకరాలు లాక్కోవాలని చూశారు. మేం పోరాటం చేసాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక 2203 ఎకరాలకు కుదించి అనుమతులు ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి.
..విజయవాడ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకా విస్తరణ పూర్తి చేయలేదు. ప్రధాని మోదీ పర్యటన తరువాత భోగాపురంలో మేము సభ పెట్టి అన్ని వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం. ఎయిర్పోర్ట్ భూసేకరణ చేయలేకపోయారు. జిల్లా వైఎస్సార్సీపీ ఆఫీస్ విషయంలో అశోక్ గజపతి రాజు జోక్యం చేసుకోవడం తగదు. గురివింద గింజ సామెత గుర్తు పెట్టుకోండి.. మీ గౌరవం కాపాడుకోండి’’ అని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.


