కాకినాడ: డీఎస్సీ స్కామ్పై అన్ని ఆధారాలు చూపించామని, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ ఒక్కటే సరైనదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగిందని ఆధారాలతో సహా చూపించామని, అయినా ఇప్పటివరకూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదన్నారు. లోకేష్ గతంలో చాలెంజ్ విసిరితే తాము సిద్ధమయ్యామని, మీరు మాత్రం తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.
యువత పోరాటానికి కూటమిలో బీజేపీ మంత్రి నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. మరి డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తేలిన తర్వాత లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు కురసాల కన్నబాబు. లోకేష్ నైతిక బాధ్యత లేదా? అని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు వేయడం లేదని కన్నాబాబు ప్రశ్నించారు.
డీఎస్సీలో స్కామ్ అనేది నిజం
విజయవాడ: డీఎస్సీలో పెద్ద స్కామ్ జరిగిందనేది వాస్తవమని, మెగా డీఎస్సీ కాదు.. ఇది దగా డీఎస్సీ అని యువతే అంటున్నారని ఎమ్మెల్యే కల్పలతరెడ్డి ధ్వజమెత్తారు. డీఎస్సీపై వచ్చింది ఆరోపణలు కాదని, నిజం అనే విషయం తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగాలు ఇచ్చారని, అందుకోసం జీవోలు మార్చారని మండిపడ్డారు.
నిజంగా డిఎస్పీ కోసం చదివిన అభ్యర్ధులు మాత్రం నష్టపోయారని, దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయడాలని డిమాండ్ చేశారు. ఒక్కో పోస్ట్కి రూ. 15 లక్షలు అంటూ ఆడియోలు కూడా వచ్చాయని, ఇది వాస్తవం కాదా? అని నిలదీశారు. డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


