విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వేలాదిమంది ఆర్టీసీ ఉద్యోగుల సంతకాలు సేకరించిన ఆర్టీసీ జేఏసీ తమ కార్యాచరణను మరింత ముమ్మరం చేసే దిశగా సాగుతోంది. రేపు(సోమవారం, జూలై 27వ తేదీ) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎంకు ఆర్టీసీ ఉద్యోగుల వినతి పత్రాలు సమర్పించనున్నారు.
ప్రధానంగా విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించవద్దని జేఏసీ డిమాండ్ చేస్తుంది. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగులతోనే నడపాలనేది వారి ప్రధాన డిమాండ్. ఈ మేరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన జేఏసీ.. వాటిని రేపు రాష్ట్ర వ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎంకు వినతి పత్రాలు అందజేయనుంది.
దీనిలో భాగంగా జూలై 30వ తేదీన జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. ప్రభుత్వ స్పందన అనుకూలంగా రాని పక్షంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై ఈనెల 30వ తేదీన జేఏసీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ పెద్దలతో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ.. తమ సమస్యల పరిష్కారం కోసం సంతకాల కార్యక్రమం చేపట్టింది. దీనికి అనూహ్య స్పందన రావడంతో తదుపరి కార్యాచరణకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమవుతోంది.


