న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేడు (మంగళవారం) ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు సహకరించాలని లోక్సభ స్పీకర్ కోరగా, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ తలెత్తడంతో ఉభయ సభలు వాయిదా పడ్దాయి. కాగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ను లోక్సభలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు రాజ్యసభలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టనుండగా, ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.
లోక్సభ జాబితా ప్రకారం.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలను కఠినంగా శిక్షించేందుకు 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఈ సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు. ఈ దిగువ సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, కేంద్ర మంత్రులు పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ స్టాండింగ్ కమిటీ నివేదికల సమర్పణ, పార్లమెంటరీ కమిటీ సిఫారసుల అమలుపై ప్రకటనలు ఉంటాయి. గౌహతి ఎయిమ్స్ పాలకమండలికి లోక్సభ సభ్యుడి ఎన్నిక కోసం తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు రాజ్యసభలో.. 2006 నాటి ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ‘ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రవేశపెట్టనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను పరిశీలన, ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానున్నారు.


