బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, మథుర బీజేపీ ఎంపీ హేమా మాలిని రాజకీయ ప్రవేశం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రముఖ నటుడు, భర్త ధర్మేంద్ర తీవ్రంగా వ్యతిరేకించారట. భారీ జనసందోహం, ఎన్నికల ప్రచారంలో ఎదురయ్యే భద్రతా సమస్యల గురించి ఆయన ఎంతో ఆందోళన చెందేవారు. అయితే తల్లి ఇచ్చిన ఒక సలహా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. హేమా మాలిని రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు? ఆమె పెట్టిన ఆ ఒక్క షరతు ఏంటో ఈ ఈ కథనంలో తెలుసుకుందాం.
రాజకీయాలపై ధర్మేంద్ర వ్యతిరేకత
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, తన భార్య హేమా మాలిని రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని మొదట్లో అస్సలు అంగీకరించలేదు. ఆమె భద్రత గురించి ఆయన నిత్యం భయపడేవారు. రాజకీయాల్లోకి వెళ్లడం అవసరమా? అని ఆయన తరచూ ప్రశ్నించేవారట.
భారీ జనసందోహం చూసి భయం
బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడ భారీ జనసందోహం తరలివచ్చేది. ఆ విపరీతమైన రద్దీని చూసి ధర్మేంద్ర తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. ‘నువ్వు అంత పెద్ద జనం మధ్యలోకి వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండు’ అంటూ ఆయన ఆమెను హెచ్చరిస్తూ ఉండేవారని హేమా మాలిని వెల్లడించారు.
హెలికాప్టర్ ప్రయాణాలపై ఆందోళన
ఎన్నికల ప్రచార సమయంలో హేమా మాలిని తరచూ హెలికాప్టర్లలో ప్రయాణించాల్సి వచ్చేది. ఈ వైమానిక ప్రయాణాల గురించి కూడా ధర్మేంద్ర తీవ్రంగా కలత చెందేవారు. ‘ఇవన్నీ చేయడం నిజంగా అవసరమా?’ అని ఆయన ఆమెను పదే పదే ప్రశ్నించేవారని తెలిపారు.
వినోద్ ఖన్నా ప్రచారంతో మలుపు
1999లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నటుడు వినోద్ ఖన్నా కోసం హేమా మాలిని ప్రచారం చేశారు. ఆ సమయంలోనే ఆమెకు తనకున్న ప్రజాదరణ ఏంటో పూర్తిగా అర్థమైంది. అంత పెద్ద ఎత్తున జనం తనను చూసేందుకు రావడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఆమెకు రాజకీయాలపై ఆసక్తిని కలిగించింది.
తల్లి ఇచ్చిన స్ఫూర్తిదాయక సలహా
మొదట్లో రాజకీయాల్లోకి రావడానికి హేమా మాలిని నిరాకరించినప్పటికీ, ఆమె తల్లి చేసిన బోధ ఆమెను మార్చేసింది. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వంటి దిగ్గజాలున్న బీజేపీ గొప్ప పార్టీ అని తల్లి ఆమెకు నచ్చజెప్పారు. ‘నువ్వు ఇప్పటివరకు ప్రజలను ఎంతగానో అలరించావు, ఇక దేశం కోసం కూడా ఏదో ఒకటి చేయి’ అని తల్లి ఇచ్చిన సలహా ఆమెను ఆలోచనలో పడేసింది.
ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒకే ఒక్క షరతు
బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి హేమా మాలిని పార్టీ ముందు ఒక ప్రధాన షరతు పెట్టారు. తాను కేవలం మథుర నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడిపై ఆమెకున్న గాఢమైన భక్తే ఇందుకు ప్రధాన కారణం. ఆ సమయంలో సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తనకు ఎంతో అండగా నిలిచారని ఆమె గుర్తు చేసుకున్నారు.
విజయవంతంగా రాజకీయ ప్రయాణం
షోలే, సీతా ఔర్ గీతా, డ్రీమ్ గర్ల్ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో బాలీవుడ్లో తిరుగులేని క్వీన్గా నిలిచిన హేమా మాలిని, ప్రస్తుతం రాజకీయాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ధర్మేంద్ర ఆందోళనలను అధిగమించి, తల్లి మాటలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, ప్రస్తుతం మథుర ప్రజల అభిమాన ఎంపీగా విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆమె భర్త ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: వీడని బిగ్ మిస్టరీ: 23 ఏళ్లుగా ప్రముఖ నటుడు అదృశ్యం!


