నీట్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం.. మరో ఆసక్తికర మలుపు తిరిగింది. రాజీనామా కంటే ముందే కేంద్రం మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించకుండా.. ఆయన శాఖను మార్చే ప్రతిపాదనను కేంద్రం చేసిందట. ఇదే విషయాన్ని ఆ సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా ద్వారా ప్రకటించగా.. అది వాస్తవమేనన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రధాన డిమాండ్గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం, సీజేపీ మధ్య జరిగిన చర్చల్లో కీలక ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు సమావేశమైన సమయంలో.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించినట్లు సమాచారం. మిగతా రెండు డిమాండ్లను ఎలాంటి షరతుల్లేకుండా అంగీకరిస్తూ.. ఈ ఒక్క డిమాండ్ విషయంలోనే పంతం వీడాలని కోరినట్లు సమాచారం. అయితే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు దాన్ని తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఒక మంత్రిని కొనసాగించాలా? లేదంటే శాఖ మార్చాలా? అన్నది ప్రధానమంత్రి పరిధిలోని నిర్ణయమని కేంద్ర ప్రతినిధులు వివరించినట్లు తెలుస్తోంది. అయితే సీజేపీ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని సమాచారం. కేవలం శాఖ మారిస్తే సరిపోదని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న సీజేపీ
నీట్ వ్యవహారంలో విద్యార్థుల ఆందోళనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని సీజేపీ మొదటి నుంచీ డిమాండ్ చేసింది. విద్యార్థుల్లో నమ్మకం పునరుద్ధరించాలంటే నాయకత్వ మార్పు అవసరమని వాదించింది. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను అంగీకరించలేదని తెలుస్తోంది.
ఇటు రాహుల్ కూడా..
ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక. ఆయన రాజీనామా చేయాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడం అనైతికం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆయన శాఖను మార్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు సమాచారం ఉంది. కానీ, ఆయన్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందే. లేకుంటే ఆందోళనలను విరమించం అని రాహుల్ గాంధీ ఆ సమయంలో మీడియా ద్వారా వెల్లడించారు. అటు నిరసనకారులు.. ఇలా విపక్షాలు . రాజీనామాపైనే పట్టుబట్టడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.
రాజీనామా తర్వాత రాజకీయ వేడి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీయే నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అదే సమయంలో ప్రతిపక్షాలు.. ఆయన రాకపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తన చర్యను సమర్థించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చేలా ప్రసంగం ఇచ్చారు.
ఉద్యమం తర్వాత కొత్త దశ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి నెరవేరినప్పటికీ.. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశం మరో వివాదంగా మారింది. దీనిపై కేంద్రంతో చర్చలు జరిపిన సీజేపీ.. కేసుల ఉపసంహరణ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరుతోంది. మొత్తంగా నీట్ వివాదం కేవలం పరీక్షల నిర్వహణ అంశానికే పరిమితం కాకుండా.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల వరకు ప్రభావం చూపింది.


