ముంబై: ఇటీవల జరిగిన జెన్-జీ ప్రొటెస్ట్లో ముంబైలో ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్ను అడ్డుకుని నిరసనకు ప్రతీకగా నిలిచిన మోడల్ రియా అహిర్ ఇప్పుడు తనపై ఆన్లైన్ వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను పోలీసు వ్యాన్ను అడ్డుకున్న ఘటన తర్వాతి నుంచి బెదిరింపులు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నానంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంఐడీసీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో.. సామాజిక మాధ్యమాల్లో నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని, తన పోస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై విద్వేష ప్రచారం సాగుతోందని, ఇందులో పరువునష్టం, బెదిరింపులు, మహిళలపై ద్వేషపూరిత దూషణలు, డీప్ఫేక్ వీడియోలు ఉన్నాయని కూడా ఆరోపించారు.
వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. పరువునష్టం కలిగించే పోస్టుల స్క్రీన్షాట్లు, యూఆర్ఎల్లు, ఇతర ఆధారాలను కూడా సమర్పించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
జూలై 22న ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ సమీపంలో రియా అహిర్ పోలీసు వ్యాన్ను అడ్డుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్పై దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను ఆ వ్యాన్లో తీసుకెళ్తున్నారు.
బూడిద రంగు హూడీ ధరించి, పోలీసు వ్యాన్ బానెట్పై చేయి ఉంచి ధైర్యంగా నిలబడ్డ ఆమె దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో తాను సహజసిద్ధంగా స్పందించానని రియా అహిర్ చెప్పారు.
"పోలీసులు తప్పు చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టే నేను అలా చేయగలిగాను. మీ హక్కుల గురించి మీకు తెలుసుండాలి" అని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తనది సహజ స్పందన మాత్రమేనని, కానీ ప్రజలు దాన్ని అసాధారణ ఘటనగా చూడటం ఇప్పటికీ తనకు ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.


