మరో సంచలనం.. సీజేపీ కీలక నిర్ణయాలు.. మళ్లీ ఆందోళనలు? | CJP warns Centre over alleged breach of agreement | Sakshi
Sakshi News home page

మరో సంచలనం.. సీజేపీ కీలక నిర్ణయాలు.. మళ్లీ ఆందోళనలు?

Jul 27 2026 6:06 PM | Updated on Jul 27 2026 7:05 PM

CJP warns Centre over alleged breach of agreement

న్యూఢిల్లీ: విద్యార్థులపై దాడులు చేసిన పోలీసులపై కేసులు పెడతామని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) తెలిపింది. న్యూఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆందోళన సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. చర్చల సమయంలోనూ కేసులు ఎత్తేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తమకు తెలిపారని చెప్పారు.

ఒప్పందం అమలు చేయకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని కేంద్రానికి సీజేపీ వార్నింగ్‌ ఇచ్చింది. ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది.

కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు ఉద్దేశించి ఎక్స్‌లో కూడా సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా ఓ పోస్ట్‌ చేశారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌లో విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు దాడులు చేయడాన్ని ప్రస్తావించారు.

"జేపీ నడ్డా, జితేంద్ర సింగ్.. ఆందోళనకారులపై పోలీసు చర్యలు ఉండవని జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని మేము గమనిస్తున్నాం. బిహార్, బెంగాల్‌లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో వందలాది మందిపై నిఘా పెట్టి వేధిస్తున్నారు. ఆందోళనకారులకు లాజిస్టిక్స్ సాయం అందిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలను ఢిల్లీలో అదుపులోకి తీసుకుంటున్నట్టు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. 

ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించాలి. విద్యార్థులను విడుదల చేయాలి. ఇకపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, భాజపా మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల పోలీసులు కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదు. మా ఒప్పందానికి అనుగుణంగా ఇదంతా అమలు కావాలి. లేదంటే మేము మళ్లీ ఆందోళనలో కూర్చోవాల్సి వస్తుంది. చట్టపరమైన కేసులపై రాతపూర్వక ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో నిర్ణయించిన గడువులతో పాటు రేపటిలోగా మాకు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం" అని రాంకా తెలిపారు.

విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెడతాం

జూలై 25న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఆందోళన విరమించారు. ఆ సమయంలో సీజేపీ, ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌తో జరిగిన ఒప్పందంలో కేసులు ఎత్తివేయడం, పోలీసుల వేధింపులు అడ్డుకోవడం, ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టే చట్టం తీసుకురావడం వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించింది.

అంతకుముందు రోజే సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్.. అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను అరెస్టు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేసి, ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరారు.

"అసోం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లో విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరుగుతోందని మాకు ఎన్నో నివేదికలు వస్తున్నాయి. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని దాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement