తాడేపల్లి: రాజ్యాంగ బద్ధంగా బతికే పరిస్థితి ఏపీలో లేదని, రాజ్యాంగాన్నే సవాల్ చేసే చర్యలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
ఈరోజు( సోమవారం, జూలై 27వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘ సాయికృష్ణ కేసులో సిట్ విచారణ ఏమైంది?, సాయికృష్ణ తల్లి సీబిఐ విచారణ కోసం వేసిన పిటిషన్ను ఎందుకు వెనక్కు తీసుకున్నారు?, క్రాంతికుమార్ ఆత్మహత్యకు కారణం ఏంటి?, పోలీసు వేధింపులే ఈ సంఘటనలన్నిటికీ కారణం.
మాల గంగమ్మ కేసులో హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు అయ్యాయి. చివరికి ఆమె చనిపోయినా ప్రభుత్వంలో కదలిక లేదు. తన కుమారుడు కనపడలేదని ఫిర్యాదు చేసి చివరకు ఆ తల్లే చనిపోయింది.
ఈ ఎపిసోడ్లో దర్గయ్య అనే వ్యక్తిని తెచ్చి అతన్నీ చిత్రహింసలకు గురి చేశారు. ఒక తప్పును కప్పి పుచ్చుకోవటానికి మరెన్నో తప్పులు చేస్తున్నారు. పోలీసులే శిక్షలు వేసుకుంటూ పోతే ఇక కోర్టులు ఎందుకు?, యధేచ్చగా లాకప్డెత్లు,, వాటర్ డెత్లు, ఆత్మహత్యలు జరుగుతుండటం పోలీసుల వైఖరికి అద్దం పడుతున్నాయి. వీటన్నిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు.


