హైదరాబాద్ హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తీర్పు సీఎం రేవంత్కు చెంప దెబ్బగా అభివర్ణించిన ప్రవీణ్కుమార్.. హైడ్రా పేరుతో ప్రభుత్వం ఎన్నో దారుణాలు చేసిందన్నారు. హిట్లర్ ఆదర్శమంటూ హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్.. క్రూరమైన 99 జీవో తీసుకొచ్చారన్నారు. హిట్లర్ రక్తపాతం చేసినట్లు హైడ్రాతో హైదరాబాద్లో విధ్వంసం సృష్టించారన్నారు.
‘దివ్యాంగుల కాలనీని కూడా హైడ్రా నేలమట్టం చేసింది. అమీన్పూర్లో ఎన్నో బిల్డింగ్లను కూల్చేశారు. ఘోరమైన, క్రూరమైన చరిత్ర హైడ్రాకు ఉంది. జీవో నంబర్ 99లో చెప్పినట్లు హైడ్రా నడుచుకోలేదు. కూల్చివేతలు వద్దని హైకోర్టు చెప్పినా బిల్డింగ్లను నేలమట్టం చేశారు. కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు చూస్కొని హైడ్రా విరుచుకుపడేది. హైడ్రా పేరుతో ఎన్నో దారుణాలు చేశారు.
పిల్లల పుస్తకాలు చిందర వందర చేశారు, ముసలమ్మను ఈడ్చిపడేశారు. దిగువ మధ్యతరగతి, పేదల ఇళ్లపై హైడ్రా విరుచుకుపడింది. ధనవంతుల బిల్డింగ్ల జోలికి హైడ్రా వెళ్లలేదు. సీఎం రేవంత్ సోదరుడు ఇల్లును హైడ్రా కూల్చలేదు. రంగనాథ్ కాకపోతే మరొకరు వస్తారు.. అసలు చేపిస్తున్నది ఎవరు..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్.


