సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ( సోమవారం) యశోదా ఆసుపత్రికి వెళ్లారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వారికి ధైర్యం చెప్పారు.
నిన్న హన్మకొండలో ఆదివారం సుదర్శన్ రెడ్డికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆయనను గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యపరిస్థితిపై కేసీఆర్ నిరంతరం ఆరా తీస్తున్నారు.


