సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ రక్తదాన శిబిరం నిర్వహించగా.. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇటు తెలంగాణ భవన్, అటు గాంధీభవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించాల్సి వచ్చింది.
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో బీఆర్ఎస్వీ.. ‘రేవంత్ రక్తదాహానికి రక్తదానం’ అనే నినాదంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు.. ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాళేశ్వరం అంశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సేకరించిన రక్తపు ప్యాకెట్లతో.. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి నిరసన తెలుపుతామని బీఆర్ఎస్వీ నేతలు అంటున్నారు. దీంతో తెలంగాణ భవన్ బయట భారీగా పోలీసులు మోహరించారు. ఇక..
మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగింది. గాంధీభవన్లో ‘అవినీతి కాళేశ్వరం’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించింది. ప్రాజెక్టు లోపాలు అంటూ పలు చిత్రాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కాళేశ్వరం అంశాన్ని ఇరు పార్టీలు రాజకీయ ఆయుధంగా మార్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. మరోవైపు రాజకీయ కక్షతోనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో కాళేశ్వరం వ్యవహారం చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమవుతోంది.


