సాక్షి,హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్కుమార్ ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. నిందితుడు ప్రస్తుతం సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో, ప్రత్యేక పోలీసు బృందాలు అత్యంత వేగంగా అక్కడికి తరలివెళ్లాయి.
రాజ్కుమార్ ఆచూకీపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ స్పందించారు. షాబాద్ హత్యకేసు నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితుడు సూర్యాపేట్లో ఉన్నట్లు లీడ్ దొరికింది. ఎస్ఓవోటీ పోలీసుల్ని పంపించాం. పోలీసుల అదుపులో ఉన్నది రాజ్కుమార్ ఆ? కాదా అన్నది? స్పష్టత లేదు. సూర్యాపేటకు వెళ్లాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం. పోలీసులు అదుపులోకి తీసుకొని ఉంటే అధికారికంగా తెలిజేస్తాం’ అని అన్నారు.
రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా?
అయితే, పోలీసులు తనిఖీలు చేపట్టి అదుపులోకి తీసుకునే లోపే నిందితుడు రాజ్కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని రహస్యంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
అవన్నీ వదంతులే: పోలీసులు
గంటల వ్యవధిలోనే భార్యాపిల్లలతో సహా ఆరుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన రాజ్కుమార్, పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే మొదట తిమ్మాపూర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని చూసినప్పటికీ, చివరి నిమిషంలో మనసు మార్చుకుని రైల్వే ట్రాక్ పై నుంచి పక్కకు దూకేసి పరారయ్యాడు. దీనికి సంబంధించిన రైల్వే సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలించారు. కాగా, నిందితుడి దొరకడంపై వస్తున్న ఈ పరిణామాలపై ఉన్నతాధికారులు అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వీటన్నింటినీ ప్రాథమిక సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


